మరోసారి ‘ఊ..’ అనేశారా?
ABN , First Publish Date - 2022-07-03T09:33:13+05:30 IST
సమంత లాంటి స్టార్ ఐటెమ్ గీతంలో కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
సమంత లాంటి స్టార్ ఐటెమ్ గీతంలో కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే.. ఆమె తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఐటెమ్ పాటల్లో నటించడానికి ఆమె ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. అయితే అనూహ్యంగా ‘పుష్ప’లో ‘ఊ అంటావా మామా..’ అంటూ మాస్ని ఉర్రూతలూగించారు. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. ‘పుష్ప’ విజయంలో ఆ పాట కూడా కీలక పాత్ర పోషించింది. ఆ పాటకు గానూ సమంతకు రూ.1.5 కోట్ల పారితోషికం అందిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఓ ఐటెమ్ గీతం కోసం అత్యధిక పారితోషికం తీసుకొన్న దక్షిణాది కథానాయికగా సమంత రికార్డు సృష్టించారని చెప్పొచ్చు. అయితే ఆ తరవాత... సమంత మరే ఐటెమ్ గీతంలోనూ కనిపించలేదు. దానికి తోడు తెలుగులో ఆమె మరింత బిజీ అయిపోయారు. బాలీవుడ్లోనూ ఓ సినిమా ఒప్పుకొన్నారు. దాంతో.. సమంత మళ్లీ ఐటెమ్ గీతంలో కనిపించడం కష్టమనే వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు సమంత మళ్లీ ఐటెమ్ గాళ్గా కనిపించనుందని టాలీవుడ్ సమాచారం. ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందని, అందుకోసం సమంతని సంప్రదించారని, పారితోషికం కూడా గట్టిగానే ఇస్తామన్న హామీ రావడంతో ఈ పాట చేయడానికి సమంత ఒప్పుకొన్నారని వార్తలొస్తున్నాయి. పైగా ఆ నిర్మాణ సంస్థతో సమంతకు మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం రీత్యా సమంత ఈ పాట ‘ఓకే’ చేశారని సమాచారం అందుతోంది. ఆ పాట ఏ సినిమాలో ఉంటుంది? హీరో ఎవరు? ఎప్పుడు తెరకెక్కిస్తారు? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.