విడాకులపై వెనక్కి తగ్గిన ఐశ్వర్య - ధనుష్‌?

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

కోలీవుడ్‌ హీరో ధనుష్‌, ఆయన సతీమణి ఐశ్వర్య రజనీకాంత్‌ విడాకులు తీసుకోవాలన్న నిర్ణయంపై వెనక్కితగ్గినట్టు గత రెండు రోజులుగా మీడియాలో..

విడాకులపై వెనక్కి తగ్గిన ఐశ్వర్య - ధనుష్‌?

కోలీవుడ్‌ హీరో ధనుష్‌, ఆయన సతీమణి ఐశ్వర్య రజనీకాంత్‌  విడాకులు తీసుకోవాలన్న నిర్ణయంపై వెనక్కితగ్గినట్టు గత రెండు రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని ఇటు ధనుష్‌ దంపతులు లేదా వారి  కుటుంబ సభ్యులు తోసిపుచ్చలేదు. అలాగని ఖండించనూ లేదు. దీంతో వారిద్దరు విడాకులు తీసుకోవాలన్న నిర్ణయంపై వెనక్కితగ్గారన్న వార్తలు నిజమేనని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 2004లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఈ పిల్లలు చదివే స్కూల్‌లో జరిగిన ఒక వేడుకకు ఐష్‌ దంపతులిద్దరూ కలిసి హాజరయ్యారు. ఆ సంఘటనే ఇద్దరూ ఒక్కటయ్యేందుకు శ్రీకారం చుట్టింది. పైగా, ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ మనశ్శాంతి లేదంటూ రజనీకాంత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. విడిపోయిన తన కుమార్తె, అల్లుడిని కలిపేందుకు ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. వివాహ బంధంపై తనకున్న నమ్మకాన్ని ధనుష్‌ దంపతులకు వివరించడమే కాకుండా కలిసి జీవించేందుకు ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలన్న షరతు కూడా విధించినట్టు వార్తలు కూడా వచ్చాయి.. ఈ నేపథ్యంలో రజనీ ఆవేదన, తమ పిల్లల భవిష్యత్‌, కుటుంబ గౌరవ మర్యాదల దృష్ట్యా వారిద్దరు కలిసి జీవించాలన్న మంచి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం తర్వాత విజయదశమి పర్యదినాన ఇరు కుటుంబాల సభ్యులంతా రజనీకాంత్‌ నివాసంలో కలుసుకుని పండుగను కూడా జరుపుకొన్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో విడాకులు కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకునే విషయంపై ధనుష్‌ - ఐశ్వర్యలిద్దరూ సంయుక్తంగా ఒక ప్రకటనను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయొచ్చన్న ప్రచారం సాగుతోంది. కాగా, వీరిద్దరు గత జనవరి 17వ తేదీన విడాకులు తీసుకోనున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెల్సిందే. 

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST