కంటెస్టెంట్ను ఆదుకుంటానంటున్న బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్
ABN , First Publish Date - 2022-03-19T22:21:26+05:30 IST
బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్స్ల్లో రెమో డి సౌజా ఒకరు
బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్స్ల్లో రెమో డి సౌజా ఒకరు. కొన్ని హిందీ సినిమాలకు కూడా రెమో దర్శకత్వం వహించాడు. తాజాగా డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నాడు. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్-5’లో జడ్జీగా పాలు పంచుకుంటున్నాడు. ఈ షోలో పాల్గొనేందుకు వచ్చిన ఓ కంటెస్టెంట్ను అతడు సర్ప్రైజ్ చేశాడు. ఆ కంటెస్టెంట్ను ఆదుకుంటానని రెమో మాటిచ్చాడు.
‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్-5’ షో జీ టీవీలో ప్రసారమవుతోంది. ఈ షోకు జడ్జీలుగా రెమో డి సౌజా, సోనాలీ బింద్రే, మౌనీరాయ్ వ్యవహరిస్తున్నారు. ఈ షోలో హిమాన్షు అనే 8ఏళ్ల బాలుడు పాల్గొన్నాడు. తన స్టన్నింగ్ పర్ఫర్మామెన్స్తో జడ్జీలను ఆకట్టుకున్నాడు. ప్రదర్శన అనంతరం హిమాన్షు తన వ్యక్తిగత విషయాలను జడ్జీలతో పంచుకున్నాడు. ‘‘నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అమ్మనే పెంచి పెద్ద చేసింది. మా జీవనోపాధి కోసం అమ్మ రిక్షా నడపడం మొదలుపెట్టింది. ఈ రిక్షాను కొనేందుకు ఆమె అప్పు చేసింది. మహిళ రిక్షా డ్రైవర్ కావడంతో మా అమ్మను కొంత మంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు’’ అని హిమాన్షు చెప్పాడు. అతడి కథ వినగానే రెమో కన్నీటి పర్యంతమయ్యాడు. లోన్ను తిరిగి చెల్లించేందుకు సహాయం చేస్తానన్నాడు. పెండింగ్ మొత్తం ఎంత ఉందో చెప్పాలన్నాడు. ఆ అమౌంట్ను తానే పూర్తిగా చెల్లిస్తానని చెప్పాడు.