‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళుతున్నారా? అయితే ఈ నిబంధనలు పాటించాల్సిందే!
ABN , First Publish Date - 2022-02-23T02:15:14+05:30 IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళుతున్నారా? అయితే ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే చట్టపరమైన చర్యలకు గురికాకతప్పదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్ర..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళుతున్నారా? అయితే ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే చట్టపరమైన చర్యలకు గురికాకతప్పదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న హైదరాబాద్, యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్గా జరగబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ కార్యక్రమం ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా బుధవారానికి వాయిదా పడింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని ముఖ్య అతిథులుగా వస్తుండటంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. అంతకముందు ఇదే స్థలంలో జరిగిన ‘పుష్ప’ వేడుకలో గొడవలు, తొక్కిసలాటలు వంటివి జరగడంతో ఈసారి అలాంటివి జరగకుండా నివారించేందుకు పోలీసులు కొన్ని నిబంధనలను విడుదల చేశారు. ఈవెంట్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాల్సిందిగా వారు కోరారు. నిబంధనలు ఏమిటంటే..
1. కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే.. లోనికి అనుమతి ఉంటుంది. పాసులు లేకుండా వచ్చి గుంపులు కట్టడానికి అనుమతి లేదు. ఫిబ్రవరి 21 అని ఉన్న పాసులు చెల్లవు. కొత్తగా ఇచ్చిన పాసులు ఉన్నవారినే అనుమతించడం జరుగుతుంది.
2. వచ్చే వాహనాలన్నింటికి పార్కింగ్ సౌకర్యం కల్పించడం కష్టంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. వ్యక్తిగత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈవెంట్కి రావాల్సిందిగా కోరుతున్నాం.
3. ఎటువంటి పాసులు లేకుండా వేడుక వద్దకి వచ్చి గుంపులుగుంపులుగా చేరి అల్లర్లు చేస్తే.. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాసులు లేకుండా దూర ప్రాంతాల నుండి వచ్చి లేనిపోని ఇబ్బందులు పడవద్దు.
4. యూసుఫ్గూడ వైపుగా వెళ్లే వాహనదారులు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి.. ముందుగానే తెలియపర్చడమైనది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5 నుండి యూసుఫ్గూడ వైపు వెళ్లే వారు సత్యసాయి నిగమమం, శ్రీనగర్ కాలనీని ఎంచుకోవాలని మనవి. మైత్రీవనం నుండి యూసుఫ్గూడ మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లేవారిని సవేరా ఫంక్షన్ హాల్ నుండి డైవర్ట్ చేయడం జరుగుతుంది.
5. ఈ వేడుకకి వచ్చిన వారు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ కాకుండా నిర్దేశించిన ప్రదేశంలో (సవేరా ఫంక్షన్ హాల్, మహమ్మద్ ఫంక్షన్ ప్యాలెస్, యూసుఫ్గూడ మెట్రో స్టేషన్ పార్కింగ్, సవేరా ఫంక్షన్ హాట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్గూడ గవర్నమెంట్ స్కూల్) మాత్రమే పార్క్ చేయాలి. అలా కాకుండా రోడ్డుపై పార్క్ చేస్తే సీజ్ చేసి, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.