నష్టపరిహారం చెల్లించాల్సిందే!
ABN , First Publish Date - 2022-05-25T05:50:45+05:30 IST
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘శేఖర్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే... ఈ సినిమా ఇప్పుడు కోర్టు గొడవల్లో చిక్కుకుంది...
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘శేఖర్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే... ఈ సినిమా ఇప్పుడు కోర్టు గొడవల్లో చిక్కుకుంది. ఈ సినిమా ప్రదర్శనపై న్యాయస్థానం నుంచి స్టే ఆర్డరు రావడంతో ‘శేఖర్’ ఆగిపోయింది. దీనిపై ఈ చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘ఈ సినిమా నిర్మాతని నేను మాత్రమే. ఈ సినిమాకీ జీవిత గారికీ నిర్మాణ పరంగా ఎలాంటి సంబంధం లేదు. జీవిత గారి గత ఆర్థిక లావాదేవీలకూ, ‘శేఖర్’ చిత్రానికీ ముడి పెట్టి చూడడం భావ్యం కాదు. న్యాయ స్థానం కూడా ‘శేఖర్’ ప్రదర్శనల్ని నిలిపివేయాలని చెప్పలేదు. వచ్చిన ఆదాయాన్ని ఓచోట చేర్చి, ముందు ఫైనాన్షియర్కి ఇవ్వాల్సిన మొత్తం క్లియర్ చేయమని తీర్పునిచ్చింది. అసలు ఈ సినిమాకీ జీవితగారికీ సంబంధమే లేనప్పుడు, ఈ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంతో వాటిని క్లియర్ ఎలా చేస్తాం? కావాలని కొంతమంది కుట్రపన్ని శేఖర్ ప్రదర్శనల్ని నిలిపివేశారు. ‘శేఖర్’ సినిమా ఆగిపోవడం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయా. ఆ నష్టానికి సదరు వ్యక్తులు పరిహారం చెల్లించాల్సిందే’’ అన్నారు.