ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-25T14:56:06+05:30 IST

ప్రముఖ దర్శకుడు కేఎస్‌ సేతుమాధవన్‌ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం చెన్నై నగరంలోని తన నివాసంలో

ప్రముఖ దర్శకుడు కన్నుమూత

అడయార్‌(చెన్నై): ప్రముఖ దర్శకుడు కేఎస్‌ సేతుమాధవన్‌ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం చెన్నై నగరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ను ‘కన్నుమ్‌ కరాలుమ్‌’ అనే చిత్రం ద్వారా మల యాళంలో బాలనటుడిగా పరిచయం చేసింది ఈయనే. తమిళంలో సీనియర్‌ నటుడు శివకుమార్‌ నటించిన ‘మరుపక్కం’ అనే చిత్రంతో అటు హీరోకు, ఇటు దర్శకుడికి మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును ఆయన అందుకున్నారు. అలాగే, సేతుమాధవన్‌ దర్శకత్వం వహించిన చిత్రాల్లో దాదాపు పది వరకు జాతీయ చలన చిత్ర అవార్డులు, 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి. 1931 మే 15వ తేదీన జన్మించిన ఈయన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1995 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఈయన... దాదాపు 60 చిత్రాలను తెరకెక్కించారు. ఈయన దర్శకత్వం వహించిన తొలిచిత్రం ‘సింఘాలీస్‌’. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత అసిస్టెంట్‌ దర్శకుడిగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన సేతుమాధవన్‌.. రామ్‌నాథ్‌ వద్ద కో-డైరెక్టరుగా పనిచేశారు. అలాగే, ఏఎస్‌ఏ.స్వామి, సుందర్‌రావు, నందకర్ణి వంటి దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేశారు. 1995లో ఎన్‌ఎఫ్‌డీసీ నిర్మించిన ‘స్త్రీ’ అనే తెలుగు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించి, సేతు మాధవన్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. సేతుమాధవన్‌ మృతిపట్ల నటులు శివకుమార్‌, కమల్‌ హాసన్‌తోపాటు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన భౌతికకాయానికి శివకుమార్‌ అంజలిఘంటించారు. 

Updated Date - 2021-12-25T14:56:06+05:30 IST