ఇలా రుణం తీర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది: చిరంజీవి
ABN , First Publish Date - 2021-11-12T21:05:21+05:30 IST
నాకు 90 శాతం సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు కోటిగారి రుణం తీర్చుకోలేకపోయానే అనే బాధ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ల అబ్బాయిని ఆశీర్వదించడంతో.. ఆయన రుణం తీర్చుకునే అవకాశం లభించిందని, అందుకు ఎంతో సంతోషంగా..
నాకు 90 శాతం సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు కోటిగారి రుణం తీర్చుకోలేకపోయానే అనే బాధ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ల అబ్బాయిని ఆశీర్వదించడంతో.. ఆయన రుణం తీర్చుకునే అవకాశం లభించిందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా.. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘11:11’. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ను గురువారం హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు చాలా మంచి రోజు. నా మరో సినిమా ‘భోళా శంకర్’ చిత్రం కూడా ఈ రోజే ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటిగారు. ఎందుకంటే కోటితో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతో ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని సంగీతం అందించాడు. ముఖ్యంగా చెప్పాలంటే నా విజయానికి, నా ఎదుగుదలకి సింహభాగం రాజ్ - కోటిలదే అని చెప్పాలి. ఇద్దరు కూడా నా సినిమాకు సంబంధించిన సాంగ్స్ను ప్రత్యేకంగా 80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు వంటి సినిమాలు 12 వరకు చేయడం జరిగింది. సుమారు 60 సాంగ్స్ అంటే నాకు 90 శాతం సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి కోటిగారి రుణం తీర్చుకోలేకపోయానే అనే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటిగారి కుమారుడు రాజీవ్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కోటిగారి రుణం ఇలా అయినా కొంత తీర్చుకోవడానికి ఈ వేడుక నాకు వేదిక అయింది.
సాలూరి రాజేశ్వరరావుగారు ఎంతో గొప్ప లెజెండరీ సంగీత దర్శకుడు.. తన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చిన కోటిగారు కూడా తండ్రి బాటలో పయనించి సంగీతంలో తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ రోజుకి కూడా తనంటే నాకు ఎంతో స్పూర్తి. చాలామంది తెరమరుగవుతున్నా.. తను మాత్రం బుల్లితెరపై కూడా తన ప్రస్థానాన్ని మళ్ళీ కొనసాగిస్తూ.. కాంటెంపరరీగా ఉంటూ ఔత్సాహికులను ఉత్సాహపరుస్తూ తను మంచి మనసుతో ముందుకు వెళ్తున్నారు. అతనిలో ఉన్న పాజిటివ్నెస్ తనని ముందుకు నడిపిస్తుంది. తన ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా తను ప్లాన్ చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంటేనే వండర్ఫుల్ ఇండస్ట్రీ. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే నేను గ్రాండ్గా వెల్ కమ్ చెప్తాను. సినీ కళామతల్లిని నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా చెడిపోలేదు. వచ్చిన వారంతా కూడా మొదటగా కష్టాన్ని నమ్ముకుని పని చేస్తూ నిజాయితీగా ఉండాలి. అలా ఉన్న వారికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇండస్ట్రీలో జయాపజయాలు అనేవి సహజం వాటిని పక్కన పెట్టి మన కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్గా పనిచేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. సినీ ఇండస్ట్రీకి కొత్త తరం రావాలి. వచ్చి ఇండస్ట్రీలో మాలాంటి పెద్దల ఎక్స్పీరియన్స్ తో సలహాలు తీసుకోవాలి ఇండస్ట్రీ ఎప్పుడూ ఫ్రెష్గా సాగిపోవాలని కోరుకుంటున్నాను.
అలాగే రాజీవ్కు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ నివ్వాలి. అలాగే రాజ్గారి అబ్బాయి సాగర్కు కూడా ఈ సినిమాలో అవకాశం కల్పించడం జరిగింది. సాగర్ కూడా తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కూడా లాభాపేక్ష లేకుండా ఫ్యాషన్తో ఇండస్ట్రీకి రావడం చాలా గొప్ప విషయం. వారి కోరిక ప్రకారం ఈ సినిమాతో పాటు తను పెట్టిన టైగర్ హిల్స్ ప్రొడక్షన్ కూడా గొప్ప విజయం సాధించి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు కిట్టుగారికి, హీరోయిన్ వర్షలకు ఈ సినిమా ద్వారా గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ చిత్ర యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.