Amitabh Bachchan to Shah Rukh Khan: చిక్కుల్లో నలుగురు బాలీవుడ్ హీరోలు.. అలాంటి బ్రాండ్ని ప్రమోట్ చేసినందుకు..
ABN , First Publish Date - 2022-05-20T21:20:00+05:30 IST
కొన్ని వారాల క్రితం.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మసాలా బ్రాండ్ ప్రకటనలో నటించినప్పుడు అయిన కాంట్రవర్సీ..
కొన్ని వారాల క్రితం.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మసాలా బ్రాండ్ ప్రకటనలో నటించినప్పుడు అయిన కాంట్రవర్సీ గురించి అందరికీ తెలిసిందే. ప్రజల నుంచి వచ్చిన విమర్శల కారణంగా క్షమాపణలు కోరుతూ అక్షయ్.. ‘చట్టపరమైన కారణాల వల్ల ఈ ప్రకటన నుంచి తప్పుకోలేను. కానీ ఈ పారితోషికాన్ని మాత్రం మంచి పనుల కోసం ఉపయోగిస్తాను. భవిష్యత్తులో ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటాను’ అని ఓ ప్రకటనను సైతం విడుదల చేశాడు. తాజాగా పాన్ మసాలాని ప్రమోట్ చేసినందుకుగాను అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గణ్ (Ajay Devgn), రణ్వీర్ సింగ్ (Ranveer Singh)లపై ముజఫర్పుర్లో కేసు నమోదైంది.
ఈ నలుగురు బాలీవుడ్ స్టార్ హీరోలపై 467, 468, 439, 120బీ సెక్షన్ల కింద సామాజిక కార్యకర్త తమన్నా హస్మ్ కోర్టులో ఫిర్యాదు చేశారు. డబ్బుకోసం తమ పాపులారిటీని ఈ హీరోలు అనుచితంగా ఉపయోగిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుని ఆమోదించిన అక్కడి కోర్టు మే 27న విచారించనుంది. అయితే.. అక్టోబర్ 2021లో, అమితాబ్ బచ్చన్ చూయింగ్ టొబాకో బ్రాండ్తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఈ పాన్ మసాలా బ్రాండ్ గురించి పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల ఆ యాడ్ని ఒప్పుకున్నట్లు బిగ్బీ ఆఫీస్ నుంచి స్టేట్మేంట్ని సైతం విడుదల చేశారు. అంతేకాకుండా ఆ యాడ్ కోసం ఆ బ్రాండ్ యాజమాన్యం ఇచ్చిన పారితోషికాన్ని సైతం అమితాబ్ తిరిగి ఇచ్చేశారు. కాగా.. అక్షయ్ కుమార్పై మాత్రం ఎటువంటి కేసు నమోదు కాలేదు.