ఎన్టీ‌ఆర్‌ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ.. నటి తండ్రి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-02-25T17:42:49+05:30 IST

గత కొన్ని నెలలుగా.. జూనియర్ ఎన్టీఆర్ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందనే వార్తలు టీ టౌన్‌లో సందడి చేస్తున్నాయి...

ఎన్టీ‌ఆర్‌ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ.. నటి తండ్రి ఏమన్నారంటే..

గత కొన్ని నెలలుగా.. జూనియర్ ఎన్టీఆర్ చిత్రంతో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందనే వార్తలు టీ టౌన్‌లో సందడి చేస్తున్నాయి. తొలి సినిమా ఉప్పెనతో సెన్సెషన్ సృష్టించిన బుచ్చిబాబు సనా ఆ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తలపై జాన్వీ తండ్రి బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.


అజిత్ హీరోగా నటించిన ‘వలిమై’ సినిమాకి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మీడియాలో మాట్లాడారు. అందులో ఓ విలేకరి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి అడగగా.. ‘ఇది సోషల్ మీడియాలో వస్తున్న పుకారు మాత్రమే. అది ఓ విచిత్రమైన ప్రదేశం. అందుకే అక్కడ ఓ కొత్త రూమర్ పుట్టుకొస్తూ ఉంటుంది. ఎన్టీఆర్‌ సినిమాలో జాన్వీ నటిస్తుందనేది కూడా అలాంటి ఓ రూమరే’ అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు.


ఇంకా మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకుల్లో శ్రీదేవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే జాన్వీ ఎప్పుడూ తెలుగు సినిమాలో నటిస్తుందని చాలామంది అభిమానులు అడుగుతున్నారు. ఇక్కడి అభిమానులు మాకు ఎంతో ప్రత్యేకం. అందుకే మీ అందరి కోరిక మేరకు కచ్చితంగా టాలీవుడ్ సినిమాలో తను నటించాలని నేనూ కోరుకుంటున్నాను’ అని బోనీ తెలిపారు.

Updated Date - 2022-02-25T17:42:49+05:30 IST