బాలీవుడ్ స్టార్లు షారూక్ ఖాన్, కత్రినా కైఫ్‌కు కరోనా

ABN , First Publish Date - 2022-06-06T02:46:41+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ నటులు షారూక్ ఖాన్, కత్రినా కైఫ్ కరోనా బారినపడ్డారు. కత్రినా ఇటీవలే పాజిటివ్‌గా తేలగా

బాలీవుడ్ స్టార్లు షారూక్ ఖాన్, కత్రినా కైఫ్‌కు కరోనా

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటులు షారూక్ ఖాన్, కత్రినా కైఫ్ కరోనా బారినపడ్డారు. కత్రినా ఇటీవలే పాజిటివ్‌గా తేలగా, తాజాగా ఆదివారం షారూక్ కరోనా బారినపడ్డాడు. ‘ఫిఫా 2022’లో బెస్ట్ యాక్టర్‌గా కత్రినా భర్త, ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ బెస్ట్ యాక్టర్‌గా ఎంపికయ్యాడు. అయితే, కొవిడ్ కారణంగా కత్రిన ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయింది. షారూక్ కరోనా సోకిన విషయం వెలుగులోకి రాగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 


తమ బ్రాండ్ అంబాసిడర్ అయిన షారూక్‌కు కొవిడ్ సోకినట్టు తెలిసిందని పేర్కొన్న మమత.. సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ నటీనటులు వరుసగా కొవిడ్ బారినపడుతున్నారు. తనకు కరోనా సోకడంతో కేన్స్ ‌ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లలేకపోతున్నట్టు వారం రోజుల క్రితం అక్షయ్ కుమార్ ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే కార్తీక్ ఆర్యన్ కూడా మహమ్మారి బారినపడ్డాడు. 


మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం 1400 కేసులు వెలుగు చూడగా, అందులో ఒక్క ముంబైలోనే 961 కేసులు నమోదయ్యాయి. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని మంత్రి ఆదిత్య థాకరే ప్రజలకు సూచించారు.  

Updated Date - 2022-06-06T02:46:41+05:30 IST