అక్షయ్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో యాక్షన్ సినిమా.. బడ్జెట్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2022-04-28T02:26:36+05:30 IST

బాలీవుడ్‌లో కామెడీ, యాక్షన్‌తో పాటు అన్ని రకాల పాత్రలు పోషించ గల నటుడు అక్షయ్ కుమార్. ఈ మధ్యనే ‘బచ్చన్ పాండే’ సినిమాతో అభిమానులను అలరించాడు. అక్షయ్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలసి

అక్షయ్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో యాక్షన్ సినిమా.. బడ్జెట్ ఎంతంటే..?

బాలీవుడ్‌లో కామెడీ, యాక్షన్‌తో పాటు అన్ని రకాల పాత్రలు పోషించ గల నటుడు అక్షయ్ కుమార్. ఈ మధ్యనే ‘బచ్చన్ పాండే’ సినిమాతో అభిమానులను అలరించాడు. అక్షయ్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలసి ‘బడే మియా, చోటే మియా’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ ఏడాది చివరలో షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. క్రిస్‌మస్ కానుకగా 2023లో మూవీని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది. అక్షయ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.   


‘బడే మియా, చోటే మియా’ కు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించనున్నాడు. హీరో, హీరోయిన్‌లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌ కాకుండా సినిమా నిర్మాణానికే దాదాపుగా రూ. 120కోట్లను వెచ్చించనున్నారని తెలుస్తోంది. ‘ఖిలాడీ’ హీరో కెరీర్‌లోనే ఇంత భారీ బడ్జెట్‌తో ఏ చిత్రాన్ని రూపొందించలేదు. షూటింగ్‌లో భాగంగా అక్షయ్, టైగర్ ష్రాఫ్‌లపై భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.  ప్రస్తుతం ఆ స్టంట్‌లపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. అక్షయ్ కుమార్ గత సినిమాలను దాదాపుగా రూ. 35కోట్ల నుంచి రూ. 60కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ‘బడే మియా, చోటే మియా’ ను అంతకు రెండు నుంచి మూడు రెట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇద్దరు హీరోలు, దర్శకుడు కలసి దాదాపుగా రూ. 200కోట్ల నుంచి రూ. 210కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకోబోతున్నట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో అధిక భాగం లండన్‌లో చిత్రీకరించనున్నారు. మార్కెటింగ్ వ్యయాలను కూడా కలుపుకుంటే ఈ మూవీ బడ్జెట్ దాదాపుగా రూ. 350కోట్లను దాటనుందని సమాచారం.

Updated Date - 2022-04-28T02:26:36+05:30 IST