సోనమ్ నివాసంలో చోరీ.. నిందితుల పట్టివేత..
ABN , First Publish Date - 2022-04-14T00:47:01+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి దాదాపుగా రూ.2.4కోట్ల నగదు, బంగారు నగలను కాజేశారు. ఈ కేసును న్యూ ఢిల్లీ పోలీసులు తాజాగా చేధించారు. సోనమ్ ఇంట్లో పనిచేసే ఓ నర్సు, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు.
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అత్తకు కేర్ టేకర్గా పనిచేస్తున్న అపర్ణ రుత్ విల్సన్, ఆమె భర్త నరేశ్ కుమార్ సాగర్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు వారు గుర్తించారు. సోనమ్ ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 23న తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆహుజా ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. మంగళవారం రాత్రి సరితా విహార్లోని అపర్ణ ఇంటిపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు జరిపారు. అపర్ణతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారి నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. గత ఏడాది మార్చిలోను సోనమ్ మామయ్య హరీశ్ అహూజాకు చెందిన షాహీ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీకి సైబర్ నిందితులు రూ.27 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు.