పాత కేసులో శిల్పాశెట్టికి భారీ ఊరట.. ఇంతకీ 15 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-25T19:39:06+05:30 IST

15 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి భారీ ఊరట లభించింది...

పాత కేసులో శిల్పాశెట్టికి భారీ ఊరట.. ఇంతకీ 15 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..

15 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి భారీ ఊరట లభించింది. ఆమెపై నమోదయిన కేసును కొట్టివేస్తూ తాజాగా ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. 2007వ సంవత్సరంలో ఏప్రిల్ 15వ తారీఖున రాజస్థాన్‌లో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు సెలెబ్రెటీలతో ఓ ప్రచార కార్యక్రమం జరిగింది. ఇందులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే శిల్పాశెట్టిని రిచర్డ్ గేర్ బహిరంగంగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నారు. దీంతో వీరిద్దరి చర్య తీవ్ర దుమారం రేపింది.


ఈ విషయంపై వారణాసి, భోపాల్, కాన్పూర్, ఢిల్లీ, ముంబైతో సహా అనేక నగరాల్లో పౌరులు పెద్ద సంఖ్యలో నిరసనలు తెలిపారు. దీంతో ఏప్రిల్ 26, 2007న రాజస్థాన్‌లోని ఓ న్యాయస్థానం శిల్పా, గేర్‌ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. అయితే, అనంతరం సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఈ అరెస్ట్ వారెంట్లను సస్పెండ్ చేసింది.


తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేతకి చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సంఘటన జరిగిన కొద్దిసేపటికే శిల్పా అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమెపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొంటూ కేసును కొట్టేశారు. ‘ఫిర్యాదులో పేర్కొన్న ఏ ఆరోపణ కూడా నిరూపితం కాలేదు. అంతేకాకుండా, తుది నివేదికలో ఎక్కడ నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 34 కింద కేసు పెట్టడానికి అవసరమైన చర్యలు లేవు. అందుకే ఈ కేసును కొట్టేస్తున్నా..’ అంటూ మేజిస్ట్రేట్ కేతకి చవాన్ స్పష్టం చేశారు.


కాగా, అప్పట్లో శిల్పాశెట్టి, రిచర్డ్‌గేర్‌లపై ఐపీసీ సెక్షన్లు 292, 293, 294 (అశ్లీలత), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని కొన్ని సెక్షన్లు, మహిళల అభ్యంతరకర ప్రవర్తన (నిషేధం) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిజానికి ఫిర్యాదును రాజస్థాన్‌లోని ఓ కోర్టు జారీ చేయగా.. అనంతరం శిల్పాశెట్టి ఆ కేసులను ముంబైకి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. దీంతో 2017లో ఆమె పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.


 తాజాగా ఈ కేసును కొట్టేయడం జరిగింది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. శిల్పాశెట్టి 13 సంవత్సరాల గ్యాప్ తరువాత పరేష్ రావల్, మీజాన్ జాఫ్రీలతో ‘హంగామా 2’ కలిసి నటించిన చిత్రం ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఈ భామ సబ్బీర్ ఖాన్ ‘నికమ్మ’లో యాక్ట్ చేస్తోంది. అంతేకాకుండా కిరోన్ ఖేర్, మనోజ్ ముంతాషిర్, బాద్షాతో కలిసి ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ అనే రియాలిటీ టీవీ షోకి కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.

Updated Date - 2022-01-25T19:39:06+05:30 IST