ఏప్రిల్ 28న కథను వినిపిస్తానంటున్న ఆమిర్ ఖాన్

ABN , First Publish Date - 2022-04-24T02:24:49+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్. విభిన్న కథాంశాలతో, ప్రయోగాత్మక పాత్రలతో అభిమానులను అలరిస్తుంటాడు.

ఏప్రిల్ 28న కథను వినిపిస్తానంటున్న ఆమిర్ ఖాన్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్. విభిన్న కథాంశాలతో, ప్రయోగాత్మక పాత్రలతో అభిమానులను అలరిస్తుంటాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకునే ముందు ఆమిర్ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. అందరికీ ఏప్రిల్ 28న ఓ కథను వినిపిస్తానని ఆ వీడియోలో పేర్కొన్నాడు.


బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఏప్రిల్ 28న ‘లాల్ సింగ్ చద్దా’ టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అభిమానులు అందరూ అనుకుంటున్నారు. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే సూచనలున్నాయని మరికొందరు ఊహిస్తున్నారు. ఆమిర్ ఖాన్ షేర్ చేసిన వీడియోలో.. బిల్డింగ్ రూఫ్‌టాప్ పైన క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఆ సమయంలోనే ఓ కథను చెబుతానని ప్రామిస్ చేశాడు. అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తుండగానే క్రికెట్ ఆడుతున్న మరో వీడియోను ఆమిర్ పోస్ట్ చేశాడు. కథ ఎక్కడ వినిపించాలో చెప్పలేదు కదా, దాని గురించి కూడా ఆలోచిస్తానన్నాడు. థియేటర్స్‌లో ‘లాల్ సింగ్ చద్దా’ గతేడాదే విడుదల కావాలి. కానీ, కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో రిలీజ్ డేట్ మారింది. హాలీవుడ్ ఐకానిక్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించింది. నాగ చైతన్య, మోనా సింగ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. 






Updated Date - 2022-04-24T02:24:49+05:30 IST