BJP to Prabhas: లైన్ కడుతున్న కమలనాథులు!
ABN , First Publish Date - 2022-09-17T00:19:43+05:30 IST
సీనియర్ నటుడు కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున పరమపదించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో ఉండటం వలన ఆ పార్టీ నాయకులకు ప్రభాస్ మీద, కృష్ణంరాజు కుటుంబం మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తోంది.
సీనియర్ నటుడు కృష్ణంరాజు (Krishnam raju)ఆదివారం తెల్లవారుజామున పరమపదించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో (BJP)ఉండటం వలన ఆ పార్టీ నాయకులకు ప్రభాస్ మీద, కృష్ణంరాజు కుటుంబం మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తోంది. కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, అమిత్ షా లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ప్రభాస్ని(Prabhas) కలవడానికి వచ్చారు అంటే, ప్రభాస్ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఏమయినా ఉండొచ్చేమో అని సినిమా పరిశ్రమలో అనుకుంటున్నారు. వీళ్ళే కాకుండా, రాష్ట్ర, ఇతర బి జె పి నాయకులు కూడా కలుస్తూనే వున్నారు. ఇంతకీ వీళ్ళు తమ సంతాపాన్ని తెలియజేయడానికే కుటుంబాన్ని కలవటం కాకుండా ఆ కుటుంబం నుంచి ఎవరిని అయినా రాజకీయ వారసులుగా తీసుకురావాలి అనుకుంటున్నారు అన్న టాక్ కూడా నడుస్తోంది. ప్రస్తుతానికి ప్రభాస్ చేస్తున్న చిత్రాలతో రానున్న నాలుగు సంవత్సరాలు తీరిక లేకుండా ఉంటాడు.
అందుకని అతను సినిమా కెరీర్ వదులుకొని రాజకీయాల్లోకి రాడు. కానీ అతని అన్న అయిన ప్రబోద్ని కృష్ణం రాజు రాజకీయ వారసుడిగా పోటీలో నిలిపే అవకాశం వుందని తెలుస్తోంది. కృష్ణం రాజు నరసాపురం (Narasapuram)నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు పోటీ చేశారు. ఎందుకంటే రాజుల బలగం ఉన్న ప్రాంతం అది. రాబోయే ఎన్నికల్లో ప్రభోద్ని అక్కడ నుంచి పోటీ చెయ్యమని బిజెపి నాయకులు కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు అలాగే ప్రభాస్కి చెప్పే వీలుందని అంటున్నారు. ఒక వేళ అదే జరిగితూ ప్రభాస్ బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రభాస్ ఇప్పుడు దేశం చెప్పుకునే స్థాయిలో ఎదిగాడు. అదీ కాకుండా రాజుల కమ్యూనిటీ నుండి అంత పెద్ద స్టార్ ఎవరూ లేరు. బీజేపీకి కనుక ప్రభాస్ని ఒప్పించి అతని అన్నని బరిలోకి దింపితే ఆంధ్రాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం వుంది అని కూడా పరిశీలకులు అంటున్నారు. ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు కృష్ణంరాజు మరణాన్ని తమ పార్టీకి అనుగుణంగా మార్చుకుంటున్నట్టు కనపడుతోంది. ఇంకా ముందు ముందు చాలామంది ప్రభాస్ కోసం లైన్ కట్టొచ్చు అని కూడా అంటున్నారు. ఏమైనా రాబోయే ఎన్నికల్లో ప్రభాస్ కూడా కీలకంగా మారే అవకాశం వుంది.