తేజా.. ‘అలిమేలు.., ఆర్ఆర్ఆర్’ ఏమయ్యాయ్?
ABN , First Publish Date - 2022-02-23T02:56:56+05:30 IST
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అంటే 2020లో తన పుట్టినరోజు(ఫిబ్రవరి 22)ను పురస్కరించుకుని క్రియేటివ్ డైరెక్టర్ తేజ రెండు చిత్రాలను ప్రకటించారు. ఒకటి గోపీచంద్ హీరోగా అనుకున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ కాగా, రెండోది రానా
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అంటే 2020లో తన పుట్టినరోజు (ఫిబ్రవరి 22)ను పురస్కరించుకుని క్రియేటివ్ డైరెక్టర్ తేజ రెండు చిత్రాలను ప్రకటించారు. ఒకటి గోపీచంద్ హీరోగా అనుకున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ కాగా, రెండోది రానా హీరోగా అనుకున్న ‘రాక్షసరాజు రావణాసురుడు (ఆర్ఆర్ఆర్)’. ఈ రెండు చిత్రాల పరిస్థితి ఏమిటనేది ఇప్పటి వరకు తెలియదు. తాజాగా అంటే రెండు సంవత్సరాల తర్వాత నేడు (ఫిబ్రవరి 22) తేజ కొత్తగా మరో రెండు చిత్రాలను ప్రకటించారు. అందులో ఒకటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ‘అహింస’ కాగా, రెండోది.. హీరో ఎవరనేది రివీల్ చేయలేదు కానీ.. తేజ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ‘విక్రమాదిత్య’ టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. ‘విక్రమాదిత్య’ చిత్ర షూటింగ్ని 22-2-22 మధ్యాహ్నం 2:22 గంటలకు శుభ ముహూర్తంలో ప్రారంభించినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. అయితే రెండు సంవత్సరాల క్రితం తేజ ప్రకటించిన పై రెండు చిత్రాలను పక్కన పెట్టేసినట్లేనా?, కనీసం ఇప్పుడు ప్రకటించిన రెండు చిత్రాలనైనా పూర్తి చేస్తాడా? లేదంటే మళ్లీ రాబోయే పుట్టినరోజుకి మరో రెండు కొత్త పేర్లను ప్రకటిస్తారా? అనేలా ప్రస్తుతం తేజపై సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.
ఇక తేజ తాజాగా ప్రకటించిన చిత్రాల విషయానికి వస్తే..
భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ప్రతిష్టాత్మకంగా ఈ ప్రేమకథను నిర్మించనున్నారు. భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. టైటిల్ లుక్లో రైలు ఆవిరిలో నుండి హీరో హీరొయిన్లు రొమాన్స్ చేస్తున్నట్లు చూపించారు. ఈ కథ 1836 సంవత్సరంలోనిది అని పోస్టర్ ద్వారా తెలిపారు. ఇదే సమయంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించాడు. ఈ కథ ఆ కాలం నాటిదని ఆ వంతెనకు, ఈ ప్రేమ కథకు మధ్య సంబంధం ఉందని తెలుస్తోంది. 22-2-22 మధ్యాహ్నం 2:22 గంటలకు ఈ చిత్ర షూటింగ్ని ప్రారంభించారు. మరో విశేషం ఏమిటంటే.. తేజ బ్లాక్ బస్టర్ చిత్రం జయం మూవీ షూటింగ్ కూడా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అదే సమయంలో ప్రారంభమైంది.
తేజ ప్రకటించిన మరో చిత్రం ‘అహింస’. మూవీ మొగల్ డి. రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటిని ఈ చిత్రంతో తేజ హీరోగా లాంచ్ చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ మరియు ప్రీ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ టైటిల్ డిజైన్ చేయడానికి జూట్ బ్యాగ్ ఆకృతిని ఉపయోగించారు. ఈ పోస్టర్లో రక్తం కారుతున్న అభిరామ్ ముఖం జూట్ బ్యాగ్తో కప్పబడి ఉంది. ఈ చిత్రానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే.. ఆర్.పి.పట్నాయక్ను సంగీత దర్శకుడిగా తేజ పరిచయం చేసిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ వాళ్లిద్దరు కలిసి ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు.