సర్ప్రైజ్: ఒకరోజు ముందే వచ్చేస్తోన్న ‘భీమ్లా నాయక్’
ABN , First Publish Date - 2022-03-23T02:56:43+05:30 IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ నటించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రం ఓటీటీ మాధ్యమంలో విడుదలయ్యేందుకు సిద్ధమైన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ నటించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రం ఓటీటీ మాధ్యమంలో విడుదలయ్యేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా ఓటీటీ మాధ్యమాలలో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతోంది. స్ట్రీమింగ్కి సంబంధించిన తేదీని కూడా రెండు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఒకరోజు ముందుగానే ఈ మాధ్యమాలలో ‘భీమ్లా నాయక్’ వస్తున్నట్లుగా తెలుపుతూ ఈ ఓటీటీ సంస్థలు సర్ప్రైజ్ చేశాయి.
ముందు మార్చి 25న ఈ చిత్రం ఈ రెండు ఓటీటీ మాధ్యమాలలో వస్తుందని ప్రకటించి.. గ్రాండ్గా ప్రచారం మొదలెట్టారు. అదే రోజు అజిత్ కుమార్ నటించిన ‘వలిమై’ ఓటీటీలో వస్తుండటంతో పాటు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలో విడుదల అవుతుండటంతో.. ‘భీమ్లా’ను ఒక రోజు ముందే ఓటీటీలోకి దించాలని మేకర్స్ భావించారు. అంతే వెంటనే సర్ప్రైజ్ను వదిలారు. దీంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘భీమ్లా నాయక్’ సినిమా విషయానికి వస్తే.. అహం, ఆత్మ గౌరవానికి మధ్య జరిగిన యుద్ధం. ఇన్స్పెక్టర్ భీమ్లా నాయక్గా పవన్ కళ్యాణ్.. రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ డానియల్ శేఖర్గా రానా దగ్గుబాటి మధ్య సాగే పోరే ఈ చిత్రం. వీరిద్దరితో పాటు సినిమాలో బలమైన మహిళా పాత్రలు కనిపిస్తాయి. ఇందులో భీమ్లా నాయక్ భార్యగా నిత్యామీనన్.. డానియల్ శేఖర్ భార్యగా సంయుక్తా మీనన్ నటించారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.