నిర్మాతలకు ఇది దేవాలయం: అక్షయ్ కుమార్
ABN , First Publish Date - 2022-03-14T01:08:09+05:30 IST
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుల్లో అక్షయ్
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. అతడు తాజాగా హీరోగా నటించిన చిత్రం ‘బచ్చన్ పాండే’. కృతి సనన్ హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ హిట్ సినిమా ‘గద్దలకొండ గణేష్’ కు రీమేక్గా ఇది తెరకెక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా(ఎన్ఎమ్ఐసీ) ‘బచ్చన్ పాండే’ చిత్రాన్ని ప్రదర్శించింది. ది వింటేజ్ అండ్ క్లాసిక్ కార్ క్లబ్ ఆఫ్ ఇండియా(వీసీసీసీఐ)తో ఎన్ఎమ్ఐసీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించింది. మహమ్మారి అనంతరం ఎన్ఎమ్ఐసీలో ప్రదర్శించిన మొదటి చిత్రం ఇదే.
ఈ వేడుకకు ‘బచ్చన్ పాండే’ హీరో, హీరోయిన్లు అక్షయ్ కుమార్, కృతి సనన్ అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎన్ఎమ్ఐసీకి రావడం ఎంతో ఆనందంగా ఉందని అక్షయ్ చెప్పాడు. నిర్మాతలకు ఇది దేవాలయం లాంటిదన్నాడు. ఈ మ్యూజియాన్ని అందరూ తప్పక సందర్శించాలని సూచించాడు. మ్యూజియంలోని కలెక్షన్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కృతిసనన్ కొనియాడింది. చిన్నపిల్లల సెక్షన్ తనకెంతో నచ్చిందని ఆమె స్పష్టం చేసింది. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా(ఎన్ఎమ్ఐసీ)లో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. పాత చిత్రాలకు సంబంధించిన పోస్టర్స్, సౌండ్ ట్రాక్స్, ట్రైలర్స్, మ్యాగజైన్స్ వంటి మరెన్నో ఆకృతులు ఈ మ్యూజియంలో చోటు దక్కించుకున్నాయి. ‘వీర పాండ్య కట్టబొమ్మన్’ లో శివాజీ గణేశన్ ధరించిన కవచం ఈ మ్యూజియంలో ఉంది. ఎమ్జీ రామచంద్రన్ ఓ చిత్రంలో ధరించిన ఎర్ర కోటు కూడా ఇక్కడ ఉండటం విశేషం.