ఢిల్లీలో పురస్కారాల పండగ
ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో వైభవంగా జరిగింది.
జాతీయ అవార్డులు అందుకొన్న సినీ తారలు
దాదా సాహెబ్ ఫాల్కే స్వీకరించిన ఆశా పరేఖ్
ఆంధ్రజ్యోతి (న్యూఢిల్లీ ): జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో వైభవంగా జరిగింది. జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 68వ జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైన వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఇదే వేదికపై దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఆశా ఫార్ఖే స్వీకరించారు. ‘‘దాదా సాహెబ్ ఫాల్కే స్వీకరించడం నా జీవితంలోని అతి పెద్ద గౌరవం. నా 80వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ఈ పురస్కారం లభించడం మరింత ఆనందంగా ఉంద’’న్నారు ఆశా. సినీ పురస్కారాల విషయానికొస్తే.. ‘అల వైకుంఠపురం’ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును స్వీకరించారు. రజత కమలం, రూ. 50 వేల నగదును ఆయన అందుకున్నారు. ‘నాట్యం’ సినిమాగాను ఉత్తమ కొరియోగ్రఫి అవార్డుకు ఎంపికైన సంధ్యా రాజు, ఉత్తమ మేకప్ ఆర్టిస్టు టీవీ రాంబాబు రజత కమలాన్ని, రూ. 50 వేల చొప్పున నగదును రాష్ట్రపతి చేతులమీదుగా స్వీకరించారు. కాగా, ఉత్తమ తెలుగు చిత్రం అవార్డుకు ఎంపికైన కలర్ ఫోటో సినిమాకు సంబంధించి ఆ చిత్ర డైరెక్టర్ అంగిరేకుల సందీప్ రాజ్, అమృత ప్రొడక్షన్స్ వర్గాలు అవార్డును అందుకున్నారు. అవార్డులో భాగంగా రజత కమలంతో పాటు రూ. లక్ష చొప్పున వారు నగదు అందుకున్నారు. ఉత్తమ నటుడు పూరస్కారాన్ని సూర్య, అజయ్ దేవగణ్ స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.