Avunu Vaalliddaru Ishtapaddaru : ఔను.. ఈ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది !

ABN , First Publish Date - 2022-08-02T21:36:51+05:30 IST

ఇలాంటి చిలిపి ఆలోచన నుంచి పుట్టిన అందమైన ప్రేమకథే ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (Avunu Vaalliddaru Ishtapaddaru). వంశీ (Vamshi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయం సాధించింది.

Avunu Vaalliddaru Ishtapaddaru : ఔను.. ఈ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది !

స్వాతి అనే అందమైన అమ్మాయిది పగలు పనిచేసే ఉద్యోగం..

అనిల్ అనే ఓ కొంటెకుర్రాడిది రాత్రిళ్ళు పనిచేసే ఉద్యోగం.. 

ఆ అమ్మాయికి తెలియకుండా.. ఆ అబ్బాయి ఆమె ఉండే అద్దె ఇంట్లోనే ఉంటూ

ఆ అమ్మాయి మనుసు దోచుకుంటే ఎలా ఉంటుంది?

ఇలాంటి చిలిపి ఆలోచన నుంచి పుట్టిన అందమైన ప్రేమకథే ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (Avunu Vaalliddaru Ishtapaddaru). వంశీ (Vamshi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయం సాధించింది. 2002, ఆగస్ట్ 2 న విడుదలైన ఈ సినిమా నేటికి సరిగ్గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రవితేజ (Raviteja), కళ్యాణి (Kalyani) జంటగా నటించగా..  ఈ సినిమాతో కృష్ణభగవాన్, జీవాలు నటులుగా పునర్జన్మనెత్తారు. ఈ సినిమా సూపర్ హిట్టవడంతో ఆ ఇద్దరూ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్నారు. 


ఇదే సినిమాతో కొండవలస లక్ష్మణరావు (Kondavalasa Lakshmanarao), ద్రాక్షారామం సరోజ (Draksharamam Saroja) అనే స్టేజ్ ఆర్టిస్టులు తొలిసారిగా సినీ రంగ ప్రవేశం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ భార్యా భర్తలుగా నటించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వి్స్తాయి. ఇంకా శివారెడ్డి, బెనర్జీ, కోటశ్రీనివాసరావు, మల్లికార్జునరావు, యమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, యల్బీ శ్రీరామ్, జయప్రకాశ్ రెడ్డి, ప్రీతినిగమ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్రీ సంగీత దర్శకత్వంలోని పాటలు అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. ఈ సినిమా నంది పురస్కారాన్ని గెలుచుకుంది. అలాగే.. ఇదే సినిమాతో ఉత్తమనటిగా కళ్యాణి నంది అవార్డు అందుకున్నారు. 


ఈ సినిమాలోని కామెడీతో సరికొత్త ఒరవడిని సృష్టించారు దర్శకుడు వంశీ. ముఖ్యంగా చిట్టిబాబుగా నటించిన కృష్ణ భగవాన్ (Krishna Bhagavan), పొట్టిరాజు గా నటించిన కొండవలస లక్ష్మణరావులపై వచ్చే కామెడీ సన్నివేశాలు అప్పటి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తాయి. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, మహర్షి సినిమా బ్యానర్స్ పై వల్లూరిపల్లి రమేశ్ ఈ సినిమాను నిర్మించారు. గూడూరు విశ్వనాథ శాస్త్రి కథ అందించగా, శంకరమంచి పార్ధసారధి మాటలు రాశారు. రవితేజ తన కెరీర్ బిగినింగ్‌లో నటించిన హిట్ చిత్రాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’. ఆసక్తికరమైన కథాకథనాలు, గిలిగింతలు పెట్టే కామెడీ, వైవిధ్యమైన పాత్రలు, నటీనటుల అద్భుతమైన అభినయం,  చక్కటి ఎమోషన్స్.. ఈ సినిమా ఘన విజయానికి బాటలు వేశాయి. ఇప్పటికీ ఈ సినిమా ప్రసారమవుతుంటే.. టీవీలకు అతుక్కుపోతారు జనం. అంతకు ముందు అంతగా హిట్స్ లేని వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా తిరిగి ఫామ్ లోకి వచ్చారు.

Updated Date - 2022-08-02T21:36:51+05:30 IST