బెయిల్ షరతు నుంచి Aryan Khan కు ఉపశమనం
ABN , First Publish Date - 2021-12-15T20:42:08+05:30 IST
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆర్యన్తో సహా అర్భాజ్ మర్చంట్, మన్మున్ ధామేచా తదితరులను అక్టోబర్ 3న అరెస్టు చేశారు. బాంబే హైకోర్టు 3 వారాల క్రితం వీరందరికి బెయిల్ను మంజూరు చేసింది. ఆర్యన్కు 14 షరతులతో కూడిన బెయిల్ను ఇచ్చింది. ఒక బెయిల్ షరతును సడలించాలని ఆర్యన్ ఖాన్ గత వారం బాంబే హైకోర్టు మెట్లెక్కాడు.
బెయిల్ షరతు ప్రకారం ముంబైలోని ఎన్సీబీ ఆఫీసు ఎదుట ప్రతి శుక్రవారం ఆర్యన్ ఖాన్ హాజరు కావాల్సి ఉంది. ఆ బెయిల్ షరతు నుంచి ఉపశమనం కల్పించాలని కింగ్ ఖాన్ తనయుడు కోర్టును ఆశ్రయించాడు. ఫలితంగా కోర్టు ఆ బెయిల్ షరతును మార్పు చేసింది. ‘‘ ఢిల్లీలోని ఎన్సీబీ కార్యాలయం సమన్లు జారీ చేసిన 72గంటల్లోగా సిట్ ముందు తప్పక హాజరు కావాలి. ముంబయిని వదిలి వెళ్లేటప్పుడు ప్రత్యేక దర్యాప్తు అధికారికి తప్పక సమాచారం ఇవ్వాలి ’’ అని బాంబే హైకోర్టు ఆదేశాలు వెలువరించింది.
ఆర్యన్ ఖాన్ తరఫున ఒక సంస్థ గతవారం కోర్టులో పిటిషన్ వేసింది. ‘‘ ఎన్సీబీ ఆఫీస్కు వచ్చిన ప్రతిసారి అక్కడ భారీ స్థాయిలో మీడియా ఉంటుంది. ఆఫీసు లోపలికి, బయటికి వచ్చేటప్పుడు పోలీసులు కలుగజేసుకోవాల్సి వస్తుంది ’’ అని ఆ పిటిషన్లో అతడు పేర్కొన్నాడు.