సల్మాన్ ఖాన్‌తో రెండో సారి సినిమా చేయనున్న ఆయుష్

ABN , First Publish Date - 2022-04-27T23:42:19+05:30 IST

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, అతడి చెల్లెలు అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ కలసి మరో సినిమా చేయనున్నారు. గతంలోనే వీరిద్దరూ ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ చిత్రంలో నటించారు

సల్మాన్ ఖాన్‌తో రెండో సారి సినిమా చేయనున్న ఆయుష్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, అతడి చెల్లెలు అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ కలసి మరో సినిమా చేయనున్నారు. గతంలోనే వీరిద్దరూ ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఆయుష్ శర్మ హీరోగా నటించగా, సల్లూ భాయ్ అతిథి పాత్రలో మెరిశాడు. తాజాగా వీరిద్దరూ కలసి మరో సినిమా ‘కభీ ఈద్, కభీ దివాళీ’ చేయనున్నారు. ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. 


సల్మాన్ ఖాన్ చెల్లెలి భర్త ఆయుష్ శర్మ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఆ ఇంటర్వ్యూలో ‘కభీ ఈద్, కభీ దివాళీ’ కీ సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘‘ఈ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్ని రకాల జోనర్ చిత్రాలు చేయాలని నాకు ఉంది. ఒక్క జోనర్‌కే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. ప్రతి సినిమా, పాత్ర‌లో వైవిధ్యం చూపించాలనుకుంటున్నాను. సల్మాన్ ఖాన్‌తో ఒక్క సినిమా కూడా చేస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. అలాంటిది భాయిజాన్‌తో కలసి రెండోసారి నటించబోతున్నాను. దేవుని ఆశీర్వాదం వల్లే ఈ అవకాశం దక్కిందనుకుంటున్నాను. అతడితో సినిమా చేస్తున్నప్పుడు కొత్తగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’’ అని ఆయుష్ శర్మ పేర్కొన్నాడు. ‘కభీ ఈద్, కభీ దివాళీ’ సినిమా డిసెంబర్ 30, 2022న థియేటర్స్‌లో విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, విక్టరీ వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - 2022-04-27T23:42:19+05:30 IST