మరో వివాదంలో శిల్పాశెట్టి.. నటి కుటుంబానికి కోర్టు సమన్లు
ABN , First Publish Date - 2022-02-13T14:29:32+05:30 IST
గత కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది శిల్పాశెట్టి. ఈ బ్యూటీ గతేడాది భర్త రాజ్కుంద్రా ఫోర్నోగ్రఫీ కేసు కారణంగా వివాదాల్లో నిలిచింది...
గత కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది శిల్పాశెట్టి. ఈ బ్యూటీ గతేడాది భర్త రాజ్కుంద్రా ఫోర్నోగ్రఫీ కేసు కారణంగా వివాదాల్లో నిలిచింది. అంతేకాకుండా ఈ భామ మరికొన్ని వివాదాలకు కేంద్ర బిందువైంది. తాజాగా ఈ అందగత్తెపై మరో కేసు నమోదైంది.
ముంబైకి చెందిన వ్యాపారవేత్త పర్హాద్ అమ్రా అంథేరిలో శిల్పాశెట్టి, ఆమె చెల్లెలు, షమితా శెట్టి, తల్లి సునందా శెట్టిపై కేసు పెట్టారు. అందులో ఆయన.. ‘శిల్పాశెట్టి తండ్రి 2015లో 21 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 2017 జనవరిలోపు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే 2016లో ఆయన మరణం తర్వాత వీరు ముగ్గురూ ఆ డబ్బుని తిరిగి చెల్లించబోమని చెప్పారు’ అని కంప్లైంట్లో పేర్కొన్నారు.
దీంతో ఈ కేసును విచారించిన అంథేరీ కోర్టు.. తదుపరి విచారణకు ఆ ముగ్గురిని 20 ఫిబ్రవరి 2022న కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏఎన్ఐ చేసిన ట్వీట్లో ‘అంథేరి కోర్టు నటి శిల్పా శెట్టి కుంద్రా, ఆమె సోదరి షమితా శెట్టి, తల్లి సునంద శెట్టికి సమన్లు జారీ చేసింది. తనకు రావాల్సిన రూ.21 లక్షల రుణాన్ని వారు తిరిగి చెల్లించలేదని ఓ వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదు మేరకు.. ఫిబ్రవరి 28న ముగ్గురు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది’ అని రాసుకొచ్చింది.