‘అఖండ’తో ఆ విషయం మరోసారి రుజువైంది: బాలకృష్ణ

ABN , First Publish Date - 2021-12-10T01:26:08+05:30 IST

కరోనా విపత్తు తర్వాత వచ్చిన ‘అఖండ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉంది. సినిమా విజయానికి ఆశీస్సులు అందించిన అప్పన్న స్వామికి, ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు..

‘అఖండ’తో ఆ విషయం మరోసారి రుజువైంది: బాలకృష్ణ

మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం ‘అఖండ’ విజయంతో మరోసారి రుజువైందని చిత్ర హీరో, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం విశాఖపట్నంలో జరగనున్న ‘అఖండ’ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు వెళ్లిన చిత్రయూనిట్ సభ్యులు.. ఉదయం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. 


అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘కరోనా విపత్తు తర్వాత వచ్చిన ‘అఖండ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉంది. సినిమా విజయానికి ఆశీస్సులు అందించిన అప్పన్న స్వామికి, ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా విజయం చిత్ర పరిశ్రమ విజయంగా భావిస్తున్నాను..’’ అని తెలిపారు. కాగా, బాలయ్యకు అప్పన్న దేవాలయ ఏఈవో కేకే రాఘవకుమార్‌ ఆహ్వానం పలుకగా ఆలయ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండప ప్రదక్షిణ చేశారు. అనంతరం చిత్ర టీమ్‌కు వేదపండితులు చతుర్వేద వచనాలతో ఆశీస్సులు ఇవ్వగా, ఏఈఓ శాలువా కప్పి సత్కరించి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. అఖండ సినిమా యూనిట్‌ అప్పన్న దర్శనానికి వస్తున్నట్టు ముందుగా సమాచారం ఉండడంతో అభిమానులు సింహగిరికి పోటెత్తారు. స్థానిక తెలుగుదేశం నేతలు పాశర్ల ప్రసాద్‌, పివి నరసింహం, కాళ్ల శంకర్‌, లొడగల కృష్ణ, పంచదార్ల శ్రీనివాస్‌ తదితరులు ప్రధాన రాజగోపురం వద్ద బాలకృష్ణకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

Updated Date - 2021-12-10T01:26:08+05:30 IST