మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న చిరు
ABN , First Publish Date - 2021-11-19T00:31:42+05:30 IST
హీరోగానే కాదు, సేవకార్యక్రమాలలోనూ తనది ప్రథమ స్థానమే అని నిరూపించుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. దశాబ్ధాలుగా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిరంతర సేవాకార్యక్రమాల్లో ఉన్న సంగతి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలతో
హీరోగానే కాదు, సేవకార్యక్రమాలలోనూ తనది ప్రథమ స్థానమే అని నిరూపించుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. దశాబ్ధాలుగా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిరంతర సేవాకార్యక్రమాల్లో ఉన్న సంగతి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలతో ఎందరో అవసరార్థులను ఆదుకుంది ఈ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కష్టకాలంలో ఆక్సిజన్ సేవల్ని ప్రారంభించి ఎందరో ప్రాణాల్ని కాపాడారు చిరంజీవి. ఇవే కాదు, అవసరంలో ఉన్న వారెవరికైనా ముందు గుర్తొచ్చేది చిరంజీవే అంటే అతిశయోక్తి కానే కాదు. అటువంటి చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సమక్షంలో బుధవారం ప్రారంభమైన యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ సెంటర్లో మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్తో పాటు 24 శాఖల కార్మికులకు సాయం అందించాలని చిరంజీవి కోరారు. మెగాస్టార్ అడగగానే సినిమా కుటుంబానికి సంబంధించిన ఎవరికైనా 50 శాతం తక్కువ ఖర్చులోనే ఆరోగ్య సేవలు అందిస్తామని.. హైదరాబాద్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యోధా లైఫ్ లైన్ డయాగ్నస్టిక్స్ వ్యవస్థాపకుడు సుధాకర్ కంచర్ల మాటిచ్చారు. అంతేకాదు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు ఆయన.. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రూ. 25 లక్షల విరాళం అందించారు.
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించలేదు. ఎన్నో సంవత్సరాలుగా నా సొంత రిసోర్సెస్తోనే ట్రస్ట్ని నడిపాను. ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్దలు ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవల్ని గుర్తించి సముచిత ఆర్థిక సాయాన్ని అందివ్వడం ఆనందదాయకం. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పైసా అవసరార్ధులకు అందేలా చేస్తా, ఇది మీకు నా హామీ. అలాగే సినిమా కుటుంబానికి చెందిన 24 శాఖల కార్మికులకు యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ సెంటర్లో 50 శాతం తక్కువ ఖర్చులోనే ఆరోగ్య సేవలందిస్తామని తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి సమాజానికి మంచి సంజ్ఞల్ని ఇస్తాయి. ఎక్కువ మందికి సేవ చేయడం.. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో మాకు సహాయపడతాయి. ఈ సందర్భంగా ఈ డయాగ్నస్టిక్స్ వ్యవస్థాపకుడైన సుధాకర్ కంచర్ల గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.