‘సీతారామం’ ఆగమనం
ABN , First Publish Date - 2022-06-26T06:25:25+05:30 IST
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాళిని ఠాకూర్ కథానాయిక. రష్మిక కీలక పాత్రధారి...
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాళిని ఠాకూర్ కథానాయిక. రష్మిక కీలక పాత్రధారి. అశ్వనీదత్ నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేయనున్నారు. ఆదివారం హైదరాబాద్లో టీజర్ ఆవిష్కరించారు. దుల్కర్ మాట్లాడుతూ ‘‘సీతారామం మర్చిపోలేని చిత్రం. ఇదో గొప్ప కథ. అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని నిర్మాతలు తీర్చిదిద్దార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వందల మంది రెండేళ్లు పడిన కష్టానికి ప్రతిఫలం.. ‘సీతారామం’. మైనస్ 24 డిగ్రీల వద్ద కూడా షూటింగ్ చేయాల్సివచ్చింది. దుల్కర్, స్వప్నల సహకారం వల్లే ఈ సినిమా సాధ్యమైంద’’న్నారు. స్వప్న మాట్లాడుతూ ‘‘కథ విషయంలో దుల్కర్ ఆచితూచి వ్యవహరిస్తారు. మేం కూడా ఈ కథని ఆయనకు పంపేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొన్నారు. మా సంస్థపై దుల్కర్ పెట్టుకొన్న నమ్మకాన్ని నిజం చేసేలా ఓ అద్భుతమైన చిత్రాన్ని ఆయనకు అందిస్తామ’’న్నారు.