Pooja Hegde: ఆ సినిమా వల్ల.. ఏడాదిపాటు పని లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది..

ABN , First Publish Date - 2022-06-28T18:45:47+05:30 IST

టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో పూజా హెగ్డే (Pooja Hegde) ఒకరు. అత్యధిక పారితోషికం తీసుకుంటూ..

Pooja Hegde: ఆ సినిమా వల్ల.. ఏడాదిపాటు పని లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది..

టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో పూజా హెగ్డే (Pooja Hegde) ఒకరు. అత్యధిక పారితోషికం తీసుకుంటూ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉంది. తమిళ సినిమా ‘మూగమూడి (తెలుగులో మాస్క్)’ సినిమాతో 2012లో సినీ పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే.. ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభంలో హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన ‘మొహంజాదారో (mohenjo daro)’ అనే పిరియాడికల్ మూవీతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయించిన ఆ మూవీ 2016లో విడుదలై బిగ్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.


పూజా మాట్లాడుతూ.. ‘వరుసగా ఆరు హిట్లు వచ్చిన సమయంలో నా కెరీర్ పీక్‌కి వెళ్లింది. అయితే.. నా కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో చేసిన ఓ సినిమా (మొహంజాదారో)కి చాలా కష్టపడ్డాను. ఆ మూవీ హిట్ అయితే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదని భావించాను. కానీ.. అది ఫ్లాపవ్వడంతో దాదాపు ఒక ఏడాది పాటు ఏ సినిమా లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దీంతో నేను చేయాలనుకునే కథలతో సినిమాలు నా దగ్గరకి రాలేదు’ అని చెప్పుకొచ్చింది.


పూజా ఇంకా మాట్లాడుతూ.. ‘అప్పట్లో నాకు వచ్చిన అవకాశాలు నా కెరీర్‌కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ.. తెలుగులో చేసిన ఓ సినిమా హిట్ అవ్వడంతో నా జాతకమే మారిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా చాలా అద్భుతంగా సాగుతోంది’ అని తెలిపింది. అయితే పూజా నటించిన మూడు పెద్ద చిత్రాలు ‘రాధే శ్యామ్‘, ‘బీస్ట్’, ‘ఆచార్య’ ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే.. పూజా ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం, పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘జేజీఎమ్’ చేస్తోంది. అలాగే.. హిందీలో సైతం రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. అవి.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ సరసన ‘సర్కస్’, అలాగే.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman khan) సరసన ‘కబీ ఈద్ కబీ దివాళి’లో నటిస్తోంది.


కాగా.. హృతిక్ సినిమా ఫ్లాప్ తర్వాత బాలీవుడ్‌లో పూజా ‘హౌస్‌ఫుల్ 4’ మూవీలో చేసింది. అది ఓ మోస్తరుగా ఆడడంతో తన కెరీర్‌కి అంతగా ఉపయోగపడలేదు. దీంతో బీ టౌన్‌లో ప్రస్తుతం చేస్తున్న చిత్రాలపై ఈ బ్యూటీ చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా సల్లు భాయ్  మూవీపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్‌లో హృతిక్ గాడిలో పెట్టలేకపోయిన ఈ భామ కెరీర్‌ని సల్మాన్ అయినా ఓ దారిలో పడేట్టూ చేస్తాడేమో చూడాలి..

Updated Date - 2022-06-28T18:45:47+05:30 IST