నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఓ వ్యక్తి మృతి.. తమిళ హీరో శింబు డ్రైవర్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-03-24T19:47:23+05:30 IST

తమిళ హీరో శింబు కారు డ్రైవర్‌ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైనందున..

నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఓ వ్యక్తి మృతి.. తమిళ హీరో శింబు డ్రైవర్ అరెస్ట్

తమిళ హీరో శింబు కారు డ్రైవర్‌ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైనందున అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం.. మార్చి 18న శింబు తండ్రి టీ.రాజేందర్, తన మనవరాలిని శింబు కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం వారు తిరిగి వస్తున్న తరుణంలో చూసుకోకుండా పాకుతూ రోడ్డు దాటుతున్న 70 ఏళ్ల వృద్ధుడిపైకి కారు ఎక్కించడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ఆ సమయంలో కారుని శింబు డ్రైవర్ సెల్వం నడిపుతున్నాడు.


అయితే ఆ ప్రమాదాన్ని గమనించిన టీ.రాజేందర్ అక్కడి 10 మీటర్ల దూరంలో కారుని ఆపించి, అంబులెన్స్‌కి కాల్ చేశాడు. అలాగే డ్రైవర్‌ని సైతం అతన్ని హాస్పిటల్‌లో చేర్పించమని చెప్పి.. మరో కారు తెప్పించుకొని అందులో వెళ్లిపోయారు. అయితే చికిత్స పొందుతున్న ఆ వృద్ధుడు మార్చి 23న మృతి చెందాడు. దీంతో నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణం అయినందుకు శింబు డ్రైవర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఆ వ్యక్తి పేరు మునిస్వామి అని, అక్కడే పేవ్‌మేంట్‌పై ఉంటాడని పోలీసులు గుర్తించారు.


కాగా.. ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ వృద్ధుడు క్రాసింగ్ వద్ద పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలోనే అటుగా వచ్చిన శింబు కారు డ్రైవర్ ఆ వ్యక్తిని చూడకపోవడంతో ఆయనపై నుంచి కారు వెళ్లింది. కేసు విచారణ కోసం ఈ వీడియోని భద్రపరిచినట్లు పోలీసు అధికారులు తెలిపారు.



Updated Date - 2022-03-24T19:47:23+05:30 IST