‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం వారికి అంకితం: నిర్మాత అభిషేక్ అగర్వాల్

ABN , First Publish Date - 2022-03-19T02:00:18+05:30 IST

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన విషయం తెలిసిందే. దేశంలో ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్ల అనూహ్య స్పందన రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం వారికి అంకితం: నిర్మాత అభిషేక్ అగర్వాల్

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన విషయం తెలిసిందే. దేశంలో ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్ల అనూహ్య స్పందన రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్‌లో తమ సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రపంచంలోని హిందూ పండిట్‌లకు, ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. 


ఆయన మాట్లాడుతూ.. 

‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్‌లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్ వచ్చి కలిసింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుండి మా పండిట్‌ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది. అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్‌లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. 2 వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది.


సినిమా అనేది కమర్షియల్. కానీ 5 లక్షల మంది కశ్మీర్ పండిట్‌ల బాధలు, సమస్యలను 32 ఏళ్ళనాటివి బయటకు తెచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యూత్‌కు ఈ చిత్రం బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ ఫీలింగ్‌ను వ్యక్తం చేశారు. ఈ సినిమా తీసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్ చేశాం. మూడు నెలలపాటు యు.ఎస్., కెనడా, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.


హిందీలో ఇది నా తొలి సినిమా. దీనికి సీక్వెల్ అనేది వుండదు. వివేక్ కథ చెప్పాకే నాకు సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్ల నుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు. అందుకే ఈ సినిమా పరంగా ఏదైనా అభినందలు వుంటే అది కశ్మీర్ పండితులకే. వారికే ఈ సినిమా అంకితం.


ప్రధాని మోదీగారిని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్‌గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకు ముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగా ప్రిపేర్ అయ్యాను. ఇంకా చెప్పాలంటే నిజాయితీగా తీస్తే భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు. త్వరలో దేశంలో అన్ని భాషల్లో ఈ సినిమాని డబ్ చేసే ఆలోచన వున్నాం. తెలుగులో కూడా డబ్ చేయబోతున్నాం.


సినిమాకి అస్సాం, యు.పి., గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతో సహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది. ఇంకా ఈ సినిమాలో చెప్పలేని కొన్ని విషయాలున్నాయి. ఏది ఏమైనా 370 ఆర్టికల్ వరకే సినిమా తీశాం. ఆ తర్వాత కంటిన్యూ చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. ఈ సినిమాలో నాతో పాటు నా కుటుంబసభ్యులు, స్టాఫ్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. 24గంటలు వారు ఈ సినిమాకు పనిచేశారు. ఈ సినిమాని ఓటీటీలో కూడా త్వరలోనే విడుదల చేస్తాం.


నటీనటుల గురించి చెప్పాలంటే.. సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్‌గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలామంది నటీనటులు ఫీల్ అయి చేశారు. ఆ పాత్రలో మమేకం అయి రాత్రి పూట నిద్ర కూడా సరిగ్గా పట్టేదికాదు వారికి. షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్‌ను అక్కడి హిందువులు డిన్నర్‌కి ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులను కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి. అందరూ పర్సనల్‌గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు.


ఈ సినిమా తర్వాత రవితేజతో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘టైగర్ నాగేశ్వరరావు’ చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్‌తో ‘ఢిల్లీ ఫైల్స్’ అనే సినిమా ఆలోచనలో వుంది..’’ అని తెలిపారు.

Updated Date - 2022-03-19T02:00:18+05:30 IST