'గేదెల రాజు' నుంచి... 'ఓ అందాల రాక్షసి' వరకు...
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:52 PM
ఈ వీకెండ్లో డబ్బింగ్, రీ-రిలీజ్, స్ట్రయిట్ అన్నీ కలిపి ఎనిమిది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరి వాటిలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఏప్రిల్ మాసం నాలుగో వారాంతంలో రెండు రీ-రిలీజ్, మూడు డబ్బింగ్ సినిమాలతో కలిపి మొత్తం ఎనిమిది చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. రీ-రిలీజ్ మూవీస్లో ఒకటి ప్రభాస్ (Prabhas), కాజల్ జంటగా నటించిన 'డార్లింగ్' (Darling) కాగా మరొకటి 'ఓ అందాల రాక్షసి'. 'డార్లింగ్' మూవీ గురువారమే థియేటర్లలో విడుదలైంది. గత యేడాది వచ్చిన 'ఓ అందాల రాక్షసి' సినిమా ఇక శుక్రవారం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్థమౌతోంది.
ఇదిలా ఉంటే ఈ శుక్రవారం మూడు అనువాద చిత్రాలు తెలుగువారి ముందుకు రాబోతోంది. వినయ ప్రసాద్ కీలక పాత్ర పోషించిన 'శ్రీ ఆదిపరాశక్తి' చిత్రం పుష్కర కాలం క్రితం కన్నడలో రూపుదిద్దుకుని, విడుదలైంది. అలానే గత యేడాది విడుదలైన 'టకిలా' అనే కన్నడ సినిమాను తాజాగా 'అప్సర' పేరుతో తెలుగులో డబ్ చేసి శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ధర్మ కీర్తిరాజ్, నిఖిత స్వామి జంటగా నటించారు. ఇక మలయాళ చిత్రం 'వాలా 2' (Vaazha 2) ఈ నెల 2న విడుదలైంది. ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గడిచిన 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసి, ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మలయాళ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సాహు గారపాటి తానే తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
ఇవి కాకుండా ఈ శుక్రవారం మూడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచే టైటిల్ రోల్ పోషించిన 'గేదెల రాజు' (Gedela Raju) గురించి. 'కాకినాడ తాలూకా' అనేది ట్యాగ్ లైన్. కాకినాడలోని ఓ రౌడీ షీటర్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటలనే ఈ సినిమా. రఘు కుంచేతో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాశ్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రఘు కుంచే ఈ సినిమాకు సంగీతాన్ని అందించడమే కాదు.... సమర్పకుడిగానూ వ్యవహరించారు. చైతన్య మోటూరి దర్శకత్వంలో వాణి రవికుమార్ మోటూరి దీన్ని నిర్మించారు. ఈ శుక్రవారం వస్తున్న మరో సినిమా 'పరమపద సోపానం' (Paramapada Sopanam). ఈ మర్డర్ మిస్టరీని పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ తెరకెక్కించాడు. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాను నారాయణరావు, ప్రసన్న ఆంజనేయులు నిర్మించారు. ఇక ఇదే శుక్రవారం సుగ్రీవ అనే చిత్రమూ జనం ముందుకు రాబోతోంది. మరి వీటిలో ఏవేవి ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.