SV Krishnareddy: అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా 'వేదవ్యాస్' హీరో పరిచయం
ABN , Publish Date - Jan 14 , 2026 | 03:32 PM
కె. అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా 'వేద వ్యాస్' చిత్ర కథానాయకుడు విశ్వనాథ్ ను దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మీడియాకు పరిచయం చేశారు. అచ్చిరెడ్డి సమర్పణలో ఈ సినిమాను పొలిటీషియన్, విద్యావేత్త కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్నారు.
హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందుకున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy). ఆయన రూపొందిస్తున్న 43వ సినిమా 'వేదవ్యాస్'. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి (K Achchi Reddy) సమర్పణలో ప్రముఖ వ్యాపారవేత్త, పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి (Kommuri Pratap Reddy) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. బుధవారం నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు 'వేదవ్యాస్' హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటుడు సాయికుమార్ (Saikumar) మాట్లాడుతూ, 'అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారి సినిమాలో నేను నటించడం ఇదే తొలిసారి. అయితే వారి ఫస్ట్ డబ్బింగ్ మూవీ 'సూర్య ది గ్రేట్' కు నేనే డబ్బింగ్ చెప్పాను. అప్పటినుంచి వారితో మంచి అనుబంధం ఉంది. అయితే చాలాసార్లు వారి మూవీస్ కు డబ్బింగ్ చెప్పాను గానీ ఎందుకో నటించడం కుదరలేదు. ఈ చిత్రంతో నాకు ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. 'వేదవ్యాస్' సినిమాలో వేద నారాయణ అనే మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. మన నాగరికతను మనం మర్చిపోకూడదు అనే మంచి అంశంతో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి గారు రూపొందిస్తున్నారు. 'ప్రేమకావాలి' సినిమాతో అచ్చిరెడ్డి గారు మా ఆదిని పరిచయం చేశారు. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యానో ఈ రోజు విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం చూస్తుంటే అంతే సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా మనకు పరిచయం ఉన్న పిడుగు సుబ్బారావు గారి కొడుకు పిడుగు విశ్వనాథ్ హీరోగా మన ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
పిడుగు సుబ్బారావు మాట్లాడుతూ, 'ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారి గొప్ప కాంబినేషన్ మూవీతో మా అబ్బాయి విశ్వనాథ్ హీరోగా పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇంతకంటే హ్యాపీగా ఫీలైన సందర్భం లేదు. కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు' అని అన్నారు. హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. వారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ మూవీలో బాగా నటించేందుకు, బాగా కనిపించేందుకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్. నాకు గతంలో ఏడీగా వర్క్ చేసే అవకాశం కల్పించారు నీరజ కోన, త్రికోటి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను' అని చెప్పారు.
ప్రొడ్యూసర్ కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, 'మా ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతో పట్టుదలగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. దాదాపు ఐదారేళ్లుగా ఈ మూవీ మీద ఆయన వర్క్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా కోసం ప్రతీ విషయం కొత్తగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కొరియా వెళ్లి ఆడిషన్ చేసి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ ని సెలెక్ట్ చేసుకున్నారు. కొరియా అమ్మాయిని మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడిగితే 'కొరియా అమ్మాయిని కాదు ఆ క్యారెక్టర్ ను యాక్సెప్ట్ చేస్తారు' అని కృష్ణారెడ్డి చెప్పారు. అలాగే మంగోలియా వెళ్లి విలన్ ను సెలెక్ట్ చేశారు. ఒక కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్ ను తీసుకున్నారు. మూవీలో వీళ్లందరినీ చూశాక కృష్ణారెడ్డి గారి జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ అనేది అర్థమైంది. పొలిటీషియన్, విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మాకు మంచి మిత్రులు. జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలనే ధ్యేయంతో కృష్ణారెడ్డి గారు రెడీ చేసిన స్క్రిప్ట్ ప్రతాపరెడ్డి గారికి బాగా నచ్చి ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు' అని అన్నారు.
డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 'విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. మంచి ఫైట్స్ చేశారు. నేను షూటింగ్ చేశా కాబట్టి ఈ విషయం చెబుతున్నా. విశ్వనాథ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమాలో కొరియన్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాం. ఆమె తెలుగు నేర్చుకుని తన డబ్బింగ్ చెప్పుకుంది. అలాగే మంగోలియా విలన్ బాగా నటించాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం చాటేలా రూపొందిస్తున్న ఈ సినిమా గురించి మేము ఇక్కడ చెప్పేది చాలా తక్కువ. మిగతా అంతా మూవీలో చూస్తారు' అని అన్నారు. తన కుటుంబంలో జరిగిన ఓ విషాద సంఘటనతో మానసికంగా కృంగిపోయిన తనను మామూలు మనిషిని చేయడం కోసం ఈ సినిమాకు పీఆర్వోగా వ్యవహరించాలని అచ్చిరెడ్డి కోరారని, అందుకే ఈ బాధ్యతను తాను స్వీకరించానని సీనియర్ జర్నలిస్ట్ ప్రభు చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ శరత్ కూడా పాల్గొన్నారు.
ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను మురళీ మోహన్, సుమన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, దేవి శ్రీ, నవీనా రెడ్డి, ఐమ్యాక్స్ వెంకట్, బేబి సహస్రశ్రీ, మాస్టర్ మురారి, మాస్టర్ మోక్షజ్ఞ, మాస్టర్ రాయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.