RC 17: ముచ్చటగా మూడోసారి.. చరణ్తో కియారా! ఈ సారైన రాత మారుతుందా
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:33 AM
న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న RC17 కథానాయిక విషయంలో ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో RC17 రానుంది. ఇటీవల బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమాతో చరణ్ రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ ఊపులోనే రామ్ చరణ్ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్తో చేయబోయే సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. కొంత గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.
అయితే, ఈ సినిమాలో చరణ్ సరసన నటించబోయే హీరోయిన్ క్యారెక్టర్పై ఇప్పుడు టాలీవుడ్లో ఒక రేంజ్ చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో రామ్ చరణ్ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani)ని పరిశీలిస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో గట్టి టాక్ వినిపిస్తోంది. సుకుమార్ తన మార్క్ మేకింగ్తో, ‘పుష్ప’ చిత్రంలో తరహాలోనే ఈ సినిమాలోనూ హీరోయిన్ పాత్రను చాలా పవర్ఫుల్గా, నటనకు ప్రాధాన్యమున్నదిగా డిజైన్ చేశారట. గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్ పరంగానూ మెప్పించగల సత్తా ఉన్న కియారా అయితేనే ఈ పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ కాంబినేషన్ వార్తలు మెగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ గతంలో నటించిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ట్రేడ్ పరంగా ఈ రెండు సినిమాలు ప్లాప్ లుగా మిగలడంతో, కియారా చరణ్కు కలిసి రావడం లేదనే సెంటిమెంట్ అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తూ.. ఈ ప్రాజెక్ట్లో ఆమెను ఎంపిక చేయడంపై ఫ్యాన్స్ నెట్టింట పెదవి విరుస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే చరణ్తో కియారాకు ఇది మూడో సినిమా అవుతుంది. కానీ, హిట్ సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని కియారా కాకుండా మరో క్రేజీ హీరోయిన్ను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిమానులు సుకుమార్కు, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు రిక్వెస్టులు పెడుతున్నారు.
కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.. సుకుమార్ సెంటిమెంట్లను అస్సలు నమ్మరు. పాత్రకు ఎవరు సెట్ అవుతారో వారినే తీసుకుంటారు. గతంలో ‘రంగస్థలం’ సమయంలోనూ సమంత పాత్రపై ఇలాగే సందేహాలు వచ్చాయి.. కానీ థియేటర్లలో రామలక్ష్మి క్యారెక్టర్ ఎలాంటి మ్యాజిక్ చేసిందో మనందరికీ తెలిసిందే. మరి ఈ సెంటిమెంట్స్, ఫ్యాన్స్ భయాలను పక్కన పెట్టి మేకర్స్ కియారా వైపే మొగ్గు చూపుతారా? లేక అభిమానుల సెంటిమెంట్ను గౌరవించి మరో గ్లోబల్ బ్యూటీని రంగంలోకి దించుతారా అనేది చూడాలి.