TFI: ఫిలిం ఛాంబర్లో మొదలైన నిర్మాతల మండలి ఎన్నికలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 09:14 AM
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Producers Council Elections) నూతన కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Producers Council Elections) నూతన కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2026–2028 రెండేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు నిర్మాతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఫిలిం ఛాంబర్ వేదికగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. నిర్మాతల మండలిలో ఓటు హక్కు కలిగిన మొత్తం 1168 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
దీంతో ఎన్నికల ప్రాంగణంలో సందడి నెలకొంది. అధ్యక్ష పదవికి సి. కల్యాణ్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన కీలక పదవులు, కార్యవర్గ సభ్యుల స్థానాల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ప్యానెళ్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ తమ మద్దతుదారులతో ప్రచారం నిర్వహించడంతో ఫిలిం ఛాంబర్ వద్ద ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది.మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ ముగిసిన అనంతరం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు పొలైన ఓట్లు 175 ఓట్లు పోల్ అయినట్లు తెలిసింది. లెక్కింపు పూర్తైన వెంటనే నూతన కార్యవర్గానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించనున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల సమస్యలు, సంక్షేమం, నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాలపై నిర్మాతల మండలి కీలకంగా వ్యవహరిస్తుండటంతో.. ఈ ఎన్నికల ఫలితాలపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.