కొందరు మా మధ్య తగాదాలు పెట్టేందుకు కుట్రలు చేశారు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:44 AM
ఎస్. జానకి మృతిపై లెజెండరీ గాయని పి. సుశీల భావోద్వేగానికి లోనయ్యారు. తమ మధ్య విభేదాలు సృష్టించిన వారిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి (S Janaki) మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆదివారం మైసూరులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిచారు. కాగా జానకి మృతిపై లెజెండరీ సింగర్ పి. సుశీల (P Susheela) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టమని, ఆమెలాంటి గాయని ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. జానకి మరణంతో భారతీయ సంగీత రంగం ఓ అపూర్వమైన గాన మణిని కోల్పోయిందని, పాటల రూపంలో జానకి ఎప్పటికీ అభిమానుల గుండెల్లో జీవిస్తూనే ఉంటారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తమ కెరీర్ ప్రారంభ రోజులను సుశీల గుర్తు చేసుకున్నారు. తాము కలిసి పాడుతూ మంచి అనుబంధంతో ఉన్నప్పటికీ, కొందరు స్వార్థపరులు తమ మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య దూరం పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, కానీ తమ స్నేహబంధాన్ని ఎవరూ దెబ్బతీయలేకపోయారని చెప్పారు. 'మా ఇద్దరి మధ్య లేని గొడవలను సృష్టించి ఆనందపడిన వారు ఇప్పుడు సంతోషపడుతూ ఉండొచ్చు. కానీ మా మధ్య ఉన్న అనుబంధాన్ని వాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయారు' అంటూ సుశీల భావోద్వేగానికి లోనయ్యారు. జానకమ్మ గాత్రం తరతరాల పాటు సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటుందని, అందుకే ఆమెకు మరణం లేదని సుశీల తెలిపారు.