Savitri Classics: సావిత్రి పుస్తకం అప్పుడు తెలుగులో... ఇప్పుడు ఇంగ్లీషులో...
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:34 PM
రెండేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన సావిత్రి క్లాసిక్స్ పుస్తకం ఇప్పుడు ఆంగ్లంలో రాబోతోంది. ఈ నెల 10న హైదరాబాద్లోని ఎఫ్.ఎన్.సి.సి.లో దానిని ఆవిష్కరించబోతున్నారు.
మహానటి సావిత్రి (Savitri) గురించి ఇప్పటికే తెలుగులో అనేక పుస్తకాలు వచ్చాయి. ఆమె జీవిత చరిత్రను పలువురు రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. సావిత్రి అంటే ప్రాణం పెట్టే సినీ చరిత్రకారుడు, రచయిత సంజయ్ కిశోర్ కొన్నేళ్ళ పాటు సావిత్రి ఫోటో ఎగ్జిబిషన్స్ ను ఆర్గనైజ్ చేశారు. ఆ తర్వాత సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి సహకారంతో 'సావిత్రి క్లాసిక్స్' పేరుతో ఆమె నటించిన చిత్రాలలోని పాత్రలను పరిచయం చేస్తూ కాఫీ టేబుల్ బుక్ తరహాలో ఓ పుస్తకాన్ని రెండేళ్ళ క్రితం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని 'సావిత్రి క్లాసిక్స్' పేరుతోనే ఆంగ్లంలోకి అనువదించారు.
'సావిత్రి క్లాసిక్స్' ఆంగ్ల పుస్తకం జూలై 10న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్లోని ఎఫ్.ఎన్.సి.సి.లో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్ కుమార్ తెలియచేశారు. తెలుగులో వచ్చిన 'సావిత్రి క్లాసిక్స్'కు అప్పట్లో మంచి ఆదరణ లభించింది. ఆ సభలోనే వక్తలు ఇది ఇంగ్లీషులో కూడా వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సావిత్రి అభిమానులు ఆనందిస్తారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అదిప్పుడు కార్యరూపం దాల్చింది.
'సావిత్రి క్లాసిక్స్' పుస్తకాన్ని చదివిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్ 'పుస్తకం చేతిలోకి తీసుకొని ముఖచిత్రాన్ని అలా చూస్తుండిపోయాను. పేజీ తిప్పాలన్న అలోచన కూడా కలగలేదు. పుస్తకం లోపల ఏముంటుందో మొత్తం ఆ ముఖచిత్రమే చెప్పేసింది. అంత అందంగా ఉంది. భక్తులు రామాయణం, మహాభారత గ్రంథాలను ఎలా దాచుకుంటారో.. సినీప్రేమికులు సంజయ్ కిషోర్ వ్రాసే పుస్తకాలను అలా దాచుకోవాలి' అంటూ కితాబిచ్చారు.
అలానే పద్మభూషణ్ అవార్డు గ్రహీత, గాయని పి.సుశీల, 'ఈ పుస్తకం ఒక్కోపేజీ తిప్పుతూ చదువుతూ వెళుతుంటే అప్పటి రోజులు, ఆ చిత్రాలు, ఆనాటి కళాకారులు.. అన్నీ కళ్ళముందు రీల్లా తిరిగాయి. అప్పటి కాలానికి వెళ్లిపోయాను. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల రోజుల్ని ఎందుకు స్వర్ణయుగం అంటామో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. సావిత్రిగారు నటించిన పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలు వేరు వేరు అధ్యాయాలుగా విభజించి వివరించడం బాగుంది. మరీ ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా ఎంత చెప్పాలో అంతే చెబుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా సులభంగా అర్థమయ్యేలా సాగిన సంజయ్ కిషోర్ రచనాశైలి బాగుంది. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనీ, మళ్లీ మళ్లీ చదవాలనీ అనిపిస్తుంది ఈ పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సావిత్రి గారంత అందంగా ఉందీ పుస్తకం. ముఖ్యంగా సావిత్రిగారి అభిమానులకు ఈ పుస్తకం ఓ పండగేనని చెప్పాలి' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ ‘ఫౌజీ’ రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ
ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్
ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’