పెద్ది షూటింగ్లో అపశృతి.. రామ్ చరణ్కి గాయం
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:29 PM
రామ్ చరణ్ గాయపడినట్టు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఏప్రిల్ చివరన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చి అభిమానులను కలవర పాటుకు గురి చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు గాయం అయ్యిందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే ఆ వార్తలపై తాజాగా చిత్ర బృందం స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది.
ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మొదట మార్చి చివరిలో విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ, పలు కారణాల వల్ల రిలీజ్ను ఏప్రిల్ 30కు మార్చిన విషయం తెలిసిందే. ఈసారి డేట్ మిస్ కాకుండా టీమ్ షెడ్యూల్ను టైట్గా ప్లాన్ చేస్తోంది.
అయితే.. సినిమా షూటింగ్లో భాగంగా ఓ హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశం తెరకెక్కిస్తున్న సమయంలో చరణ్ కంటికి స్వల్ప గాయం అయినట్లు సమాచారం. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని, చిన్నపాటి గాయం మాత్రమేనని యూనిట్ వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొనే అవకాశముందని కూడా పేర్కొంది.
గాయం వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో అభిమానులు కంగారు పడినా, ఇప్పుడు అధికారిక క్లారిటీ రావడంతో ఊరట పొందుతున్నారు. ఎలాంటి సీరియస్ ఇష్యూ లేదని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 30 తేదీకే ‘పెద్ది’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.
త్వరగా కోలుకోవాలి: పవన్ కళ్యాణ్
ఇదిలా ఉంటే... రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, 'అగ్రశ్రేణి యువ కథానాయకుడు రాంచరణ్ 'పెద్ది' సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అనే పేర్కొన్నారు.