మరోమారు నోరు జారిన రాజేంద్ర ప్రసాద్! తమిళనాట ప్రజల ఆగ్రహావేశాలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 06:10 AM
ప్రముఖ నటుడు, నట కిరిటీ, ఇటీవలే ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కార గౌరవం దక్కించుకున్న డా. రాజేంద్ర ప్రసాద్ మరోమారు నోరు జారారు.
ప్రముఖ నటుడు, నట కిరిటీ, ఇటీవలే ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కార గౌరవం దక్కించుకున్న డా. రాజేంద్ర ప్రసాద్ ( Rajendra Prasad) మరోమారు నోరు జారారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా తమిళనాట తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డును (Kalaprapurna/Nata Prapoorna T.L. Kantha Rao Memorial National Award-2025) రాజేంద్ర పప్రాద్కు ప్రకటించగా సోమవారం అవార్డు ప్రదానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగానే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఇంట్లో పెరిగానని, అందరి నటనను దగ్గర ఉండి చూశానని, తాను యాక్టింగ్ నేర్చుకున్న ఇనిస్టిట్యూట్లో రజనీకాంత్ది ఫస్ట్ బ్యాంచ్ అని తనది రెండో బ్యాచ్, చిరంజీవిది ఐదో బ్యాచ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక లవకుశ సినిమా సమయంలో కాంతారావు గారికి అనారోగ్యం ఉండడంతో ఆయన కోలుకునేంత వరకు నెల రోజులు వెయిట్ చేసి మరి రామారావు గారు కాంతారావుతోనే లక్ష్మణుడి వేషం వేయించారని ఆ సినిమా తెలుగు క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచి పోయిందన్నారు.
ఇంకా చెప్పాలంటే స్టేజీపై కాంతారావు జానపద వేషం వేస్తున్నాడంటే ఎమ్జీఆర్ ఉచ్చ పోసుకునే వాడంటు ఒకటికి రెండు మార్లు మాట్లాడారు. కాంతారావు పేరు చెబితేనే అమ్మ బాబోయ్ అంటూ భయ పడేవాడంటూ చెప్పుకొచ్చారు. అయితే.. తమిళులకు ఆరాధ్య దైవం ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ ప్రతి ఇంట్లోనూ దేవుడిగా కొలిచే ఎమ్జీఆర్ గురించి ఓ పబ్లిక్ ప్లేస్లో ఓ పేరున్న నటుడు ఇలా మాట్లాడం ఏంటి అంటూ తమిళులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఓ గొప్ప నటుడిని ప్రశంసించడానికి ఓ రాష్ట్రం అంతా దైవం కన్నా మిన్నగా ఆరాధించే ఎమ్జీఆర్ను ఇలా చులకనగా చేసి మాట్లాడడం సబబు కాదంటూ సీరియస్ అవుతున్నారు.
ఇదే కాకుండా తాను ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాల్లో యాక్టింగ్ చేస్తానని ఎన్టీఆర్ దగ్గరికి వెళితే 'మీకు వేషాలు ఎందుకు ఇవ్వాలం'టూ ఎన్టీఆర్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారన్నారు. 'దేవుడి వేషం వెయ్యాలంటే నన్ను, వెధవ వేషాలు వేయాలంటే ఎఎన్ఆర్ను, ఫైటింగ్లు చేయాలంటే కృష్ణను, ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేయాలంటే శోభన్ బాబును పిలుస్తారని అలాంటిది నీకు ఏముందని నిన్ను పిలుస్తార'ని అడిగారని దాంతో జీవితంపై విరక్తి వచ్చి వారం రోజులకు పైగా రోడ్లపై తిరిగిగానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తర్వాత చార్లీ చాప్లిన్ సినిమాలు చూశాక నా పంథా ఎంచుకుని కామెడీనే హీరోగా చేసి సినిమాలు చేయడం ప్రారంభించాను అని చెప్పారు.