Fauzi: అజ్ఞాతపర్వం ముగిసింది.. రెబలియన్ టైం మొదలైంది 

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:16 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం  ‘ఫౌజీ’ విడుదల తేదీ ఖరారైంది.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం  ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఎంతో  ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. 'అజ్ఞాతపర్వం ముగిసింది.. రెబలియన్ టైం మొదలైంది'.. డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్నీ మేకర్స్ గురువారం సోషల్ మీడియా వేదిక ప్రభాస్ కొత్త పోస్టర్ తో వెల్లడించారు. ఒళ్ళంతా రక్తంతో గన్ పట్టుకుని ఓ రాయి మీద కూర్చున్న ప్రభాస్ లుక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది.

యాక్షన్‌, ప్రేమ, దేశభక్తి అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ సినిమా పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.ఇందులో ప్రభాస్‌ బ్రిటిష్‌ ఇండియా కాలం నాటి సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రేమ కథకు దేశభక్తి అంశాలను జోడిస్తూ హను రాఘవపూడి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ సెట్లు, అద్భుతమైన విజువల్స్‌తో అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు.ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మిథున్‌ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనుండగా, పలువురు ప్రముఖ నటీనటులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తుండగా, సుదీప్‌ చటర్జీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

Updated Date - Jul 16 , 2026 | 11:43 AM