Dragon: ‘డ్రాగన్’ విషయంలో ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్..
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:08 AM
ఒక సినిమాకు పార్ట్ 2, ఫ్రాంచైజీలు, యూనివర్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. భారీ కథలను ఒక్క భాగంతో ముగించకుండా..పార్ట్ 2 అంటూ కొనసాగించడం సాధారణం అయిపోయింది.
ఒక సినిమాకు పార్ట్ 2, ఫ్రాంచైజీలు, యూనివర్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. భారీ కథలను ఒక్క భాగంతో ముగించకుండా..పార్ట్ 2 (Part 2 trend) అంటూ కొనసాగించడం సాధారణం అయిపోయింది. ముఖ్యంగా అగ్ర కథానాయకుల సినిమాల విషయంలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ (NTR)–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కూడా ఇదే బాటలో సాగుతున్నట్టు తెలుస్తోంది. ‘డ్రాగన్’ (Dragon) కథను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మాములుగా అయితే ఒక పార్ట్ పూర్తయ్యాక, దాని ఫలితాన్ని బట్టి సీక్వెల్ పనులు ప్రారంభిస్తుంటారు. కానీ ‘డ్రాగన్’ విషయంలో మాత్రం రెండు భాగాల చిత్రీకరణను ఏకకాలంలో పూర్తి చేసేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. తొలి భాగం విడుదలైన కొద్దికాలానికే రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. రెండు భాగాలకు సంబంధించిన కథ, పాత్రలు, కీలక సన్నివేశాలను ముందుగానే సిద్ధం చేసుకుని చిత్రీకరణ కొనసాగిస్తున్నారట. దీనివల్ల రెండు భాగాల మధ్య ఎక్కువ విరామం లేకుండా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు ఎన్టీఆర్ కు గాయాలైన కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్కు దూరంగా ఉన్నప్పటికీ.. హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హీరో షూటింగ్కు దూరంగా ఉన్న సమయంలోనూ షెడ్యూల్కు అంతరాయం కలగకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ తారలు అలియా భట్, షాహిద్ కపూర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ‘డ్రాగన్’ తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.