Niharika Konidela: జోరు పెంచిన నిహారిక.. ఈసారి అన్నతో సినిమా..
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:35 PM
‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా సక్సెస్తో మంచి జోరు మీదున్నారు కొణిదెల నిహారిక (Niharika konidela). ఆ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి.
‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా సక్సెస్తో మంచి జోరు మీదున్నారు కొణిదెల నిహారిక (Niharika konidela). ఆ సినిమా పలు విభాగాలలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకుంది. ఆ ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్స్ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా సంగీత్ శోభన్ తో 'రాకాస' మూవీని నిహారిక నిర్మించింది. అది ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే... ఇటీవల యదు వంశీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే! ఇప్పుడామె నుంచి మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది. తన సోదరుడు వరుణ్ తేజ్తో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయిందని తెలిసింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ (Varun Tej) ‘కొరియన్ కనకరాజు’ చిత్రంలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత వరుణ్ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందులో ఒకటి నిహారిక నిర్మించనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం. వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు చిత్రాల్లో ఒకదానికి అట్లీ దగ్గర అసోసియేట్గా పనిచేసిన బాలాజీ దర్శకత్వం వహించనుండగా, స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలుకానుంది. ‘టచ్ చేసి చూడు’ ఫేమ్ విక్రమ్ సిరికొండతో చర్చల్లో ఉన్న ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్లో ఉందని తెలిసింది.