Sanjay Dutt:మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది.. నేనూ క్యాన్సర్ బారిన పడ్డా
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:21 AM
హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం సందర్శించారు.
క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఆ మహమ్మారిపై పోరాటానికి మనో ధైర్యం కావాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి (Basavatarakam Cancer Hospital) ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ట్రస్టు సభ్యులు నారా బ్రాహ్మణి, జేఎస్ఆర్ ప్రసాద్లు సంజయ్ దత్కు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు.
అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఉన్న నందమూరి తారకరామారావు దంపతుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఆస్పత్రిలో కీలక విభాగాలను, చిన్న పిల్లల వార్డును సందర్శించి వైద్యులు, రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రోగులకు పళ్లు, చిన్నారులకు బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సంజయ్ దత్ మాట్లాడుతూ తన తల్లి క్యాన్సర్తో చని పోయిందని, కొన్నేళ్ల క్రితం తానూ లంగ్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నానని తెలిపారు. క్యాన్సర్ను నయం చేసేందుకు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, ముందస్తు పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందితే పూర్తిగా నయమవుతుందని ధైర్యం చెప్పారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు వెనుక ఉన్న కారణాలు, ఆశయాలు, లక్ష్యాలు వివరించారు. తన తల్లి పేరుతో నిర్మించిన ఈ వైద్యశాలను దేశంలోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఎందరో క్యాన్సర్ రోగులకు స్వాంతన అందిస్తున్నామని గణాంకాలతో సహా వివరించారు. భవిష్యత్తులో అత్యాధునిక డయాగ్నొస్టిక్ పరికరాలు, రేడియేషన్, రోబో టిక్ ఆపరేషన్ సిస్టం లాంటి ప్రపంచ శ్రేణి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లాబరేటరీలను అందుబాటులోకి తెచ్చి, ప్రపంచ స్థాయి అత్యున్నత శ్రేణి ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు.
