Dil Raju Case: మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ వివాదం.. దిల్రాజుకు సుప్రీంకోర్టు గుడ్న్యూస్
ABN , Publish Date - Aug 13 , 2026 | 09:37 AM
టాలీవుడ్ నిర్మాత దిల్రాజుకు (Dil Raju) ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
టాలీవుడ్ నిర్మాత దిల్రాజుకు (Dil Raju) ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న విచారణపై గతంలో విధించిన స్టేను ఎత్తివేయాలని రచయిత్రి ముమ్మిడి శ్యామలరాణి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ట్రయల్ కోర్టు విచారణపై ఉన్న స్టే కొనసాగనుంది. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr Perfect) సినిమా 2011లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా కథ తన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల నుంచి కాపీ చేశారని రచయిత్రి ముమ్మిడి శ్యామలరాణి ఆరోపించారు. 2010 ఆగస్టులో సాహితీ పబ్లిషర్స్ ఈ నవలను ప్రచురించిందని పేర్కొంటూ, 2017 జులై 12న దిల్రాజుపై ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ ట్రయల్ కోర్టు 2018 అక్టోబర్ 27న ఐపీసీ సెక్షన్ 420, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నోటీసులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ దిల్రాజు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు ఐపీసీ సెక్షన్ 420 కింద ఉన్న ఫిర్యాదును కొట్టివేసింది. అయితే కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద విచారణ కొనసాగించేందుకు ట్రయల్ కోర్టుకు అనుమతించింది.
2024 డిసెంబరులో హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను దిల్రాజు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 2025 ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు విచారణ జరిపి, కేసు విచారణకు సంబంధించిన కాలపరిమితి అంశంపై ప్రతివాదుల అభిప్రాయాలను కోరుతూ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేసి విచారణ కొనసాగించాలని శ్యామలరాణి తరఫు న్యాయవాది కోరారు. ఆమె వయసు 71 ఏళ్లు కావడంతో కేసును త్వరగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అభ్యర్థనను అంగీకరించలేదు. గతంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే స్టే విధించామని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది. దీంతో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో దిల్రాజుకు ప్రస్తుతానికి ఊరట లభించింది.