ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు వంతు..

ABN , Publish Date - Aug 09 , 2026 | 06:56 PM

ప్రస్తుతం టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద మెగా కాంపౌండ్ విజయాల పరంపరతో దూసుకుపోతోంది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది.

Sambarala Yetigattu

ప్రస్తుతం టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద మెగా కాంపౌండ్ విజయాల పరంపరతో దూసుకుపోతోంది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయాన్ని అందుకోగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో ఆల్-టైమ్ రికార్డు వసూళ్లు సాధించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రంతో తన సత్తా చాటగా, ఇటీవల విడుదలైన కొరియన్ కనకరాజుతో వరుణ్ తేజ్ కూడా మంచి విజయాన్ని అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు.


ఎన్నో ఏళ్లుగా వరుణ్ .. ఒక మంచి విజయం కోసం ఎదురుచూశాడో.. ఆ విజయం కొరియన్ కనకరాజు సినిమాతో వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కనకరాజు కనకవర్షం కురిపిస్తున్నాడు. విడుదలైన రెండు రోజుల్లోనే భారీ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక దీంతో ఫ్యాన్స్ మెగా నామ సంవత్సరం అని చెప్పుకొస్తున్నారు. ఇక తండ్రీకొడుకులు హిట్ ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు మెగా మేనల్లుడు వంతు. మెగా హీరోలలో ఇప్పుడు అందరి చూపు సాయి దుర్గ తేజ్ పైనే నిలిచింది. విరూపాక్ష తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తేజ్.. ఆ తర్వాత వచ్చిన బ్రోతో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదం నుండి కోలుకోవడం, శారీరకంగా, మానసికంగా సిద్ధమవడానికి సమయం పట్టడంతో గత మూడేళ్లుగా ఆయనకు సరైన థియేట్రికల్ రిలీజ్ పడలేదు.


ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటి గట్టు చిత్రంలో నటిస్తున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, మెగా కుటుంబంలోని దాదాపు అందరు ప్రధాన హీరోలు వరుస హిట్లను ఖాతాలో వేసుకున్నట్లవుతుంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ మాత్రమే తన తదుపరి బలమైన కమ్‌బ్యాక్ హిట్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

Updated Date - Aug 09 , 2026 | 07:12 PM