Devara 2: దేవర 2.. ఈ సారి మరింత క్రేజీగా! రంగంలోకి దిగిన.. అనిరుధ్
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:42 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన దేవర (Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత తారక్ సోలోగా వచ్చి బాక్సాఫీస్ లెక్కలను తిరగరాశారు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో సముద్రం నేపథ్యంలో వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచడమే కాకుండా, కమర్షియల్గా భారీ వసూళ్లను సాధించింది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన గ్లామర్తో తెలుగు తెరకు పరిచయం కాగా, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పవర్ఫుల్ విలనిజంతో మెప్పించారు. వీరిద్దరి ఎంట్రీ టాలీవుడ్లో సరికొత్త సందడిని నెలకొల్పింది. అయితే ఈ చిత్రం సగంలోనే ముగియడంతో, పార్ట్-2 కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'దేవర-2' అప్డేట్స్ కోసం జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.
ఇక ఇటీవల నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ఈ సీక్వెల్పై క్లారిటీ ఇస్తూ.. సినిమా షూటింగ్ ఈ ఏడాది మే నెల నుంచే ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. మొదటి భాగం అందించిన విజయం ఇచ్చిన ఊపుతో, రెండో భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం... అక్టోబర్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి, షూటింగ్ షెడ్యూల్స్పై కసరత్తులు మొదలుపెట్టారట. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సిట్టింగ్స్లో బిజీగా ఉన్నారని, పార్ట్-2 కోసం అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ సీక్వెల్ కోసం కొరటాల శివ కథలో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా, నార్త్ ఇండియా ఆడియన్స్ను కూడా మెప్పించేలా స్క్రిప్ట్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారట. పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ ఉన్న నేపథ్యంలో, యాక్షన్ సీక్వెన్స్లను ఇంకాస్త గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు.
కథలో ఉండే ఎమోషన్, డ్రామా ఈసారి మరింత హైలెట్గా ఉండబోతున్నాయి. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. మొత్తానికి 'దేవర-2' పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ తన నట విశ్వరూపంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం 'డ్రాగన్' షూటింగ్తో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేనితో పాటు రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా.. ఇదే ఏడాది 'డ్రాగన్' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.