Janhvi Kapoor: టాలీవుడ్‌లో అదే నచ్చింది.. ఆ తేడా గమనించా..

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:07 PM

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ సోమవారం విజయవాడలో జరిగిన ‘పెద్ది’ ప్రీ రిలీజ్‌ వేడుకలో తెలుగులో మాట్లాడి అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు.


అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ సోమవారం విజయవాడలో జరిగిన ‘పెద్ది’ ప్రీ రిలీజ్‌ వేడుకలో తెలుగులో మాట్లాడి అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. తన క్యూట్‌ మాటలకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. అయితే ఈ వేదికపై ఆమె ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘పెద్ది’ ఓ అద్భుతమైన సినిమా. ఇందులో అన్ని అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. అయితే ఈసారి తెరపై నేను ఎక్కువ సేపు కనిపిస్తాను’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తెలుగులో జాన్వీ నటించిన తొలి చిత్రం ‘దేవర’. ఆ చిత్రంలో ఆమె కనిపించింది కొంతసేపే. తెరపై కనిపించిన నాలుగు సీన్లు, పాటలలో గ్లామర్‌కే పరిమితమైంది. ‘బాలీవుడ్‌ నుంచి వచిచ నాలుగు సీన్లకే పరిమితమైన జాన్వీ’ అని నెటిజన్లు కామెంట్స్‌ కూడా చేశారు. దానిని మనసులో పెట్టుకున్నారో ఏమో.. సడెన్‌ పెద్ది వేడుకలో ‘ఈసారి తెరపై ఎక్కువ సేపు కనిపిస్తా’ అని చెప్పుకొచ్చారు. మరి జాన్వీ వ్యాఖ్యలు ‘దేవర’ మేకర్స్‌ని బాధ కలిగిస్తాయేమో చూడాలి.

అలాగే సౌత్‌ సినిమాలపై ప్రశంసలు వర్షం కురిపించింది జాన్వీ. సినిమాలోని ప్రతి సీన్‌ అద్భుతంగా రావాలని ఇక్కడ ప్రయత్నిస్తుంటారు. దానికోసం ఎంత సమయమైన కేటాయిస్తారు. కానీ హిందీ సినిమా సంగతికొస్తే.. ఎక్స్‌ఎల్‌ షీట్‌ అంటే బడ్జెట్‌, టైమ్‌లైన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. సౌత్‌ సినిమా సెట్‌లో   అందరిలో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. ప్రాజెక్ట్‌ త్వరగా పూర్తి చేయాలనో, డెడ్‌లైన్లను అందుకోవాలనో కాదు. సినిమాలోని ప్రతి సీన్‌ బాగా రావడం కోసం చేసే ప్రయత్నమది.  హిందీలో అంతా రూల్‌ ప్రకారం, పక్కా ప్రణాళికతో జరుగుతుంది. కొన్నిసార్లు ఈ అతి జాగ్రత్త వల్ల క్రియేటివిటీ విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. అలా సిస్టమ్యాటిక్‌గా ఉండటం వల్ల ప్రయోజనాలున్నాయి. కానీ టాలీవుడ్‌లో క్రియేటివిటీకి, వర్కింగ్‌ అవర్స్‌కు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరి పని గంటలను గౌరవించే విధానం నాకు నచ్చింది. యూనిట్‌ అందరికీ మంచి బ్రేక్స్‌ ఇస్తారు. లంచ్‌ బ్రేక్‌ అంటే అందరూ 40 నిమిషాలపాటు తిని, మరో 20 నిమిషాలు నిద్రపోయి మళ్లీ ఫ్రెష్‌గా సెట్‌లోకి వస్తారు. కానీ బాలీవుడ్‌లో ఈ విషయంలో కూడా రాజీపడాల్సి వస్తుంది’ అని చెప్పారు.

రామ్‌ చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వెంకట సతీష్‌ కిలారు నిర్మించారు.  

Updated Date - Jun 02 , 2026 | 06:37 PM