ఫిల్మ్ సిటీలో పాట చిత్రీకరణలో...
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:17 PM
హవిష్, కావ్యా థాపర్ జంటగా నటించిన సినిమా 'నేను రెడీ'. వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా చివరి పాట చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
యంగ్ హీరో హవిష్ (Havish), డైరెక్టర్ త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'నేను రెడీ' (Nenu Ready). కావ్యా థాపర్ (Kavya Thapar) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిఖిల కోనేరు (Nikhila Koneru) నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ల చిరునవ్వుతో కనిపించడంతో అందరూ దాన్ని బాగా ఇష్టపడ్డారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని ఇచ్చే ఈ సినిమా వేసవి కానుకగా త్వరలోనే జనం ముందుకు రానుంది.
'నేను రెడీ' సినిమాకు మిక్కీ జే మేయర్ (Mickey J. Meyer) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చివరి పాట చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని మేకర్స్ తెలిపారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన స్టైల్లోనే ఈ సినిమా వినోదాల విందును అందించబోతోందని నిర్మాత నిఖిల కోనేరు చెప్పారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, 'వెన్నెల' కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జిటివి గణేష్, రోహిణి, హరితేజ, మహతి, రూపలక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.