నటి గౌతమి మాజీ మేనేజర్ మోసం.. స్వదేశీ, విదేశీ సంస్థలలో పెట్టుబడులు
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:20 PM
ప్రముఖ సినీ నటి గౌతమికి (Actress Gautami) చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంలో మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మాజీ మేనేజర్ నివాసం సహా ఆరు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ-ED) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రముఖ సినీ నటి గౌతమికి (Actress Gautami) చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంలో మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మాజీ మేనేజర్ నివాసం సహా ఆరు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ-ED) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ నగదు బట్వాడాల నిరోధక చట్టం ప్రకారం ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు చెన్నై, మదురై నగరాల్లో ఒకే సమయంలో సోదాలు జరిపారు. నటి గౌతమి వద్ద సి. అళగప్పన్ అనే వ్యక్తి మేనేజర్ గా పని చేస్తుండే వారు. ఆయనకు భార్య ఏ ఎల్ నాచ్చల్, కుమారుడు శివ, కుమార్తె హారతి ఉన్నారు.
గౌతమి సినీ నటిగా సంపాదించిన స్థిరాస్తులు(Gautami properties).. ప్రత్యేకించి భూములు విక్రయించేందుకు మేనేజర్ అళగప్పన్ 'పవర్ ఆఫ్ అటార్నీ' ఇచ్చారు. ఈ అధికారాన్ని అళగప్పన్ దుర్వినియోగ పరచి నకిలీ దస్తావేజులతో గౌతమికి చెందిన రూ.25 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తన పేరున, భార్య పిల్లల పేరున రాసుకుని మోసగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు గౌతమి గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సెంట్రల్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న అళగప్పన్, ఆయన కుటుంబ సభ్యులను కేరళలో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇదిలా ఉండగా ఈ మోసం కేసులో భారీ స్థాయిలో నగదు బట్వాడా జరిగినట్టు తెలియటంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు ఈడీ చేపట్టింది. చెన్నై, మధురై నగరాలలో అళగప్పన్ కు చెందిన నివాస గృహం, కార్యాలయాలు సహా ఆరు చోట్ల ఒకే సమయంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. గౌతమికి చెందిన స్థిరాస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన నగదును అళగప్పన్ స్వదేశీ, విదేశీ సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఉండటంతో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలిసింది.