దూరదర్శిని.. అందరి మనసులను హత్తుకుంటుంది
ABN , Publish Date - May 13 , 2026 | 06:25 AM
‘దూరదర్శిని’ సినిమా 90వ దశకం జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, భావోద్వేగాలతో ప్రతి హృదయాన్ని హత్తుకుంటుందని దర్శకుడు కార్తికేయ కొమ్మి తెలిపారు. యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘‘దూరదర్శిని’ (Dooradarshini) సినిమా అందరికీ 90వ దశకం నాటి రోజులను గుర్తుకు తెస్తుంది. చిత్రలహరి పాటల ప్రోగ్రామ్ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ చిత్రంలో మంచి ఎమోషన్ ఉంది. అది అందరి హృదయాలను హత్తుకుంటుంది. ప్రతి ఒక్కరినీ వాళ్ల గోల్డెన్ డేస్లోకి తీసుకెళ్తుంది’ అని చెప్పారు దర్శకుడు కార్తికేయ కొమ్మి ( Karthikeya Kommi). సువిక్షిత్ (Suvikshit), గీతికా రతన్ (Geethika Ratan) జంటగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. వారాహి మూవీ మేకర్స్ పతాకంపై జయశంకర్ రెడ్డి ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు.
సినిమా ఈనెల 15న విడుదలవుతున్న సందర్భంగా కార్తికేయ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘అందరూ ఇది కేవలం లవ్స్టోరీ అని అనుకుంటున్నారు. కానీ, ‘దూరదర్శిని’ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. ఆంధ్రాలో జరిగిన ఓ యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. అరుణాచలంలో భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తి జీవితంలో జరిగిన కథను స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ’ అని తెలిపారు.