వెంకీ ‘ఆదర్శకుటుంబం’లో.. దివ్యేందు శర్మ?

ABN , Publish Date - May 11 , 2026 | 09:41 AM

ప్ర‌స్తుతం పెద్ది సినిమాలో న‌టిస్తోన్న దివ్యేందు శర్మకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన న్యూస్ ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో వైర‌ల్ అవుతోంది.

Venkatesh

మీర్జాపూర్ (Mirzapur) వెబ్‌ సిరీస్‌ చూసిన వారికి దివ్యేందు శర్మ (Divyendu Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వెబ్ సిరీస్‌లో మున్నా బాయ్‌ అనే విలన్‌ పాత్రలో దివ్యేందు నటించారు. చిత్రంగా ప్రవర్తిస్తూ, పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పంచిన వినోదం యువతను బాగా ఆకట్టుకుంది. ఇలాంటి దివ్యందుకు ఈ సిరీస్‌ ద్వారా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది.

మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న రామ్‌చరణ్‌ సినిమా ‘పెద్ది’లో దివ్యేందు ఒక కీలక పాత్ర పోషించారు. అయితే ఇది ఏ తరహా పాత్ర అనే విషయంలో క్లారిటీ ఇవ్వనప్పటికీ తాను ‘పెద్ది’ (Peddi)లో నటిస్తున్నాను అనే విషయాన్ని మాత్రం ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

కాగా, దివ్యేందుకు సంబంధించిన మరో వార్త ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో వైరల్‌ అవుతోంది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh), దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ‘ఆదర్శకుటుంబం’ (Aadarsha Kutumbam) అనే చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో దివ్వేందు ఓ కీలక పాత్రలో కన్పించబోతున్నారని, ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారనే టాక్‌ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమాకు ఆయన నటన ఓ మంచి అసెట్‌ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఆదర్శకుటుంబం’ చిత్రంలో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటిస్తున్నారు.

Updated Date - May 11 , 2026 | 10:46 AM