‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్.. పొలిటికల్ హీట్ పెంచిన పవర్‌ఫుల్ డైలాగ్స్

ABN , Publish Date - Aug 29 , 2026 | 01:34 PM

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Dharmasthala Niyojakavargam Trailer Released

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట (Jai Jnana Prabha Thota) దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ విడుదల చేసిన అధికారిక ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలు, ఆలోచింపజేసే పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది.

ట్రైలర్‌ను గమనిస్తే.. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు, అల్లర్లు, ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రల ప్రస్తావనతో ఈ ట్రైలర్ మొదలైంది. ‘మనీ తప్ప మానవత్వంతో సంబంధం లేని మృగాల మధ్య బతుకుతున్నాం’ అని సుమన్ చెప్పే డైలాగ్‌తో పాటు.. ‘ఇది ధర్మస్థలం.. దీని ఇంటి పేరు వైరాజ్.. ఇక్కడ మంత్రి, ముఖ్యమంత్రి, రాజ్యాంగం అన్నీ నేనే’, ‘రాజకీయం అనేది మృగాలు ఉండే అడవి లాంటిది. వాటి జోలికి వెళ్లకుండా తప్పించుకుని తిరిగితే ప్రశాంతంగా బతకొచ్చు’ అని డైలాగ్ కింగ్ సాయికుమార్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చివరిలో ‘రాజకీయ నాయకులు ఆడించినట్లు ఆడడం, వాళ్లిచ్చింది పుచ్చుకోవడం మారాలి.. అది ఈ ధర్మస్థల నియోజకవర్గం నుంచే మొదలవ్వాలి’ అంటూ సాగే మీడియా సమావేశం సీన్.. సినిమాలోని ప్రధాన కాన్సెప్ట్‌ను తెలియజేస్తోంది.


ట్రైలర్‌లో వితికా షేరు, నటరాజ్ లుక్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి, అధికారం కోసం సాగే ఎత్తుగడలు, ప్రజల్లో రావాల్సిన చైతన్యాన్ని తెరపై బలంగా చూపించబోతున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. నేపథ్య సంగీతం, యాక్షన్ ఘట్టాలు, డైలాగ్ డెలివరీ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 4న రాబోతున్న ఈ పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఇక ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో ప్రొడ్యూసర్ మేరుం భాస్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎంతో క్లారిటీతో రూపొందించారు దర్శకుడు జై జ్ఞాన ప్రభ. 45 రోజుల్లో మొత్తం షూటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అనుకున్నట్లుగా 45 రోజుల్లోనే మొత్తం ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ కంప్లీట్ చేశారు. సినిమా ఔట్‌పుట్ అందరికీ నచ్చేలా వచ్చింది. థియేటర్స్‌లో ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నామని అన్నారు.


డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ మాట్లాడుతూ.. మంచి కథతో పాటు మంచి సాంగ్స్ ఇందులో కుదిరాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు. అలాగే చంద్రబోస్ సాహిత్యం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. ప్రొడ్యూసర్ భాస్కర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. ప్రతి ఆర్టిస్ట్ మా మూవీకి సపోర్ట్ చేశారు. ఇందులోని నటీనటులు అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరికీ మంచి పేరొస్తుందని నమ్ముతున్నాం. నాలాంటి కొత్త దర్శకుడికి ఇలాంటి మంచి టీమ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. నా వెనక వీళ్లంతా ఉన్నారనే ధైర్యం ముందుకు నడిపించింది. మా సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపర్చదు. తప్పకుండా అందరినీ ఎంగేజ్ చేసేలా ఉంటుంది. సెప్టెంబర్ 4న థియేటర్స్‌కు వచ్చి, సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ చంద్రబోస్, సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్, ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల, యాక్టర్ శివకుమార్, హీరోయిన్ వితికా షేరు, యాక్టర్ నటరాజ్ వంటి వారంతా ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి:

‘తలైవర్‌’తో సెల్ఫీ.. నమ్మలేని నిజం: కయాదు లోహర్‌

‘King100’ గ్లింప్స్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా

Nayantara: మనిషి మారినా దక్కని విజయం!

Updated Date - Aug 29 , 2026 | 01:34 PM